Bengal SSC Scam: టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ అరెస్టు అయినా అర్పితా ముఖర్జీకి చెందిన పలు ఆస్తులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
Bengal SSC Scam: పశ్చిమ బెంగాల్లో బట్టబయలైన టీచర్ రిక్రూట్మెంట్ స్కాం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీ, అతని సన్నిహితురాలు సినీ నటి అర్పిత ముఖర్జీ కూడా అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. గతంలో అర్పిత ముఖర్జీ చెందిన రెండు ఇంట్లో ఈడీ దాడులు చేసి.. దాదాపు రూ.50 కోట్ల నగదు స్వాధీనం చేసుకుంది. అంతేకాకుండా.. భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను, ఇతర ఖరీదైన వస్తువులను కూడా ఈడీ సీజ్ చేశారు.
తాజాగా.. అర్పితకు చెందిన మరో ఇంట్లో కూడా ఈడీ దాడి చేసినట్టు తెలుస్తుంది. బెంగాల్లోని పాండితియా రోడ్లోని ఫోర్ట్ ఒయాసిస్లోని అర్పితా ముఖర్జీ నివాసంపై గురువారం ఈడీ బృందం దాడులు చేసింది. రవీంద్ర సరోవర్ పోలీస్ స్టేషన్కుచెందిన ఈడీ బృందం అర్పితా ముఖర్జీ నివాసానికి వెళ్లినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం నిందితులిద్దరూ ఆగస్టు 5 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
అంతకుముందు, పార్థ ఛటర్జీకి, అతని సన్నిహితురాలు అర్పితా ముఖర్జీకు మధ్య ఆర్థిక సంబంధాలను చూపించే అంశాలను ఈడీ కోర్టు ముందు ఉంచింది. అర్పితా ముఖర్జీ తన విచారణ సమయంలో యుటిలిటీ సర్వీసెస్ యొక్క బ్యాంక్ ఖాతా గురించి చెప్పారని, ఇందులో ఇద్దరికీ 50-50 భాగస్వామ్యం ఉందని, 2012లో డీడ్ను అమలు చేశారని ఏజెన్సీ కోర్టుకు తెలిపింది.
బుధవారం కూడా శాంతినికేతన్లోని ఫామ్హౌస్పై ఈడీ దాడులు చేసింది. 2012లో ఛటర్జీ, ముఖర్జీ కలిసి ఈ ప్లాట్ను కొనుగోలు చేశారని, 2020లో అర్పితా ముఖర్జీ పేరిట మ్యుటేషన్ జరిగిందని ఈడీ అధికారులు తెలిపారు.
2014 - 2021 మధ్యకాలంలో పశ్చిమ బెంగాల్లో జరిగిన టీచర్ రిక్రూట్మెంట్ స్కాం లో ప్రధాన నిందితులుగా బెంగాల్ మాజీ మంత్రి పార్థ ఛటర్జీ, అతని సన్నిహితురాలు అర్పితా ముఖర్జీలను ఈడీ జూలై 23న అరెస్టు చేసింది. స్కాం జరిగిన సమయంలో పార్థ ఛటర్జీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఈ దాడిలో అర్పితా ముఖర్జీ ఇళ్లలో 50 కోట్లకు పైగా నగదు, బంగారాన్ని కూడా ఈడీ గుర్తించింది. ప్రస్తుతం నిందితులిద్దరూ ఆగస్టు 5 వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉన్నారు. కోల్కతా కోర్టు బుధవారం ఆయనను ఈడీ కస్టడీకి పంపింది.
పార్థ ఛటర్జీ వేటు
పశ్చిమ బెంగాల్ టీచర్ రిక్రూట్మెంట్ స్కాంలో మంత్రి పార్థ ఛటర్జీ అరెస్టు తర్వాత.. ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ.. ఆయనను మంత్రివర్గం నుండి తొలగించారు. ఈ కుంభకోణంలో తనకు ప్రమేయం లేదని పార్థ ఛటర్జీ ఖండించారు. ఈడీ రికవరీ చేసిన నగదు తనది కాదని నొక్కి చెప్పారు. పార్థ ఛటర్జీని కూడా టీఎంసీ నుంచి సస్పెండ్ చేశారు.