
Bajrang Dal activist murder: కర్నాటకలో భజరంగ్ దళ్ కార్యకర్త హత్య రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తపరిస్థితులకు కారణమైంది. మరీ ముఖ్యంగా శివమొగ్గ జిల్లాలో హింస చెలరేగింది. పరిస్థితులు దారుణంగా మారడంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఈ క్రమంలోనే పోలీసు ఉన్నతాధికారి ఏడీజీపీ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. నిందితులందరినీ గుర్తించామనీ, వారిని అతి త్వరలో అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. "భజరంగ్ దళ్ కార్యకర్త, హర్ష అనే యువకుని హత్యకు సంబంధం ఉన్న నిందితులందరినీ గుర్తించాం. వారిని పట్టుకోవడానికి శివమొగ్గ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. ఈ కేసుపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది" అని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రతాప్ రెడ్డి తెలిపారు.
కాగా, ఆదివారం అర్థరాత్రి శివమొగ్గ (Shivamogga)లో రైట్వింగ్ కార్యకర్త 26 ఏళ్ల హర్ష హత్యకు గురయ్యాడు. దీంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీయకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు 144 సెక్షన్ విధించినట్టు శివమొగ్గ డిప్యూటీ కమిషనర్ సెల్వమణి ఆర్ తెలిపారు. “మొత్తం పరిస్థితి ప్రశాంతంగా ఉంది. శాంతిభద్రతల పరిరక్షణకు స్థానిక పోలీసులు, RAF ని మోహరించాం” అని వెల్లడించారు. ముందుజాగ్రత్త చర్యగా నగర (Shivamogga) పరిధిలోని పాఠశాలలు, కళాశాలలను రెండు రోజుల పాటు మూసివేస్తున్నట్లు హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించి, సత్వర చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అయితే, పోలీసుల ఆంక్షలను పట్టించుకోని రైట్ వింగ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీలు తీశారు. కార్యకర్త హత్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తీసిన ఈ ర్యాలీల్లో పలు చోట్ల ఘర్షణకు దారి తీశాయి. జిల్లావ్యాప్తంగా ముస్లింలకు చెందిన వ్యాపార సంస్థలపై రాళ్లు రువ్వడం, వాహనాలను తగులబెట్టడం వంటి సంఘటనలు నమోదయ్యాయి. ఒకవైపు హిజాబ్ వివాదం రాష్ట్రంలో కొనసాగుతోంది. దీనికి తోడు ఇప్పుడు భజరంగ్ దళ్ కార్యకర్త హత్యకు గురికావడంతో శివమొగ్గతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొన్నది. శివమొగ్గలో హింసాత్మక ర్యాలీలకు కారణమైన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు.
ఘర్షణలకు కారణమైన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శివమొగ్గలో మరో రెండు దహన ఘటనలు నమోదయ్యాయి. ఇక్కడ పలువురిని అదుపులోకి తీసుకున్నారు. “ఎఫ్ఐఆర్లు అవసరమయ్యే 14 విభిన్న సంఘటనలను మేము గుర్తించాము. అందులో, దాదాపు 3 ఎఫ్ఐఆర్లు ఇప్పటికే ఫైల్ చేయబడ్డాయి & కొన్ని సందర్భాల్లో, ఎఫ్ఐఆర్ పూర్తి చేయడానికి వారి ఆస్తి లేదా బైక్లను కోల్పోయిన బాధితులను కనుగొనడానికి మేము ప్రయత్నిస్తున్నాము” అని ADGP ప్రతాప్ రెడ్డి తెలిపారు.