
ముంబైలోని ఓ స్విమ్మింగ్ పూల్లో మొసలి పిల్ల కనిపించింది. దాదర్లోని సెంట్రల్ సబర్బ్లో ముంబై పౌర సంస్థ బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నిర్వహిస్తున్న స్విమ్మింగ్ పూల్లో మంగళవారం తెల్లవారుజామున రెండు అడుగుల పొడవున్న మొసలి పిల్ల కనిపించిందని అధికారులు తెలిపారు. మహాత్మా గాంధీ జలతరణ్ తలావో అనే ఒలింపిక్ సైజు స్విమ్మింగ్ పూల్ను సభ్యుల కోసం తెరవడానికి ముందు.. ఉదయం 5.30 గంటల ప్రాంతంలో పారిశుద్ధ్య కార్మికులు మొసలి పిల్లను గమనించినట్లుగా చెప్పారు.
అయితే ఈ విషయంపై సమాచారం అందుకున్న తర్వాత.. నిపుణల సహాయంతో మొసలి పిల్లను క్షేమంగా రక్షించినట్టుగా అధికారులు తెలిపారు. మొసలి పిల్లను సహజ ఆవాసాలలోకి విడిచిపెట్టడానికి అటవీ శాఖకు అప్పగిస్తున్నట్లు బీఎంసీ తెలిపింది. స్విమ్మింగ్ పూల్లో మొసలి ఎలా చేరిందో తెలుసుకునేందుకు దర్యాప్తు జరుగుతోందని.. దర్యాప్తు ఆధారంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని బీఎంసీ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ కిషోర్ గాంధీ చెప్పారు.
అయితే అక్కడికి సమీపంలోని ప్రైవేట్ జూ నుంచి మొసలి వచ్చి ఉండాలని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని.. ప్రైవేట్ జూలోని పాములు రోడ్లపైకి రావడంతో ప్రజలను భయాందోళనకు గురయ్యాని చెబుతున్నారు. ప్రైవేట్ జూపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.