
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ధులే జిల్లాలో ట్రక్కు పలు వాహనాలను ఢీకొట్టి.. ఆపై రోడ్డు పక్కకు ఉన్న హోటల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 10 మృతిచెందగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషయాన్ని పోలీసులు కూడా ధ్రువీకరించారు. ముంబైకి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధులేలోని ముంబై-ఆగ్రా హైవేపై పలాస్నేర్ గ్రామ సమీపంలో ఉదయం 10.45 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ట్రక్కు బ్రేక్లు ఫెయిల్ కావడంతో ట్రక్కు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే రెండు మోటార్సైకిళ్లు, కారు, మరో కంటైనర్ను ఢీకొట్టింది. ఆపై, ట్రక్కు హైవే పక్కన బస్టాప్ సమీపంలో ఉన్న హోటల్పైకి దూసుకెళ్లి బోల్తా పడింది. ‘‘కనీసం 10 మంది మరణించారు. 20 మందికి పైగా గాయపడ్డారు’’ అని తెలిపారు. ట్రక్కు మధ్యప్రదేశ్ నుంచి ధులే వైపు వెళ్తోందని చెప్పారు. బాధితుల్లో బస్ స్టాప్లో బస్సు కోసం వేచి ఉన్న వారిలో కొందరు ఉన్నారని తెలిపారు.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో గాయపడినవారి శిర్పూర్, ధూలేలోని ఆసుపత్రులకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ ప్రమాదం గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.