
World Health Organisation: భారత్లోని ఆరోగ్య వ్యవస్థలో ఆశాలది కీలకమైన పాత్ర. ముఖ్యంగా గ్రామీణ భారతంలో ఆరోగ్య వ్యవస్థలో వారి సేవలు వెలకట్టలేనివి. ఈ క్రమంలోనే వారికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. భారత్ లోని గ్రామీణ సేవలందిస్తోన్న ఆశా వర్కర్లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) గ్లోబల్ హెల్త్ లీడర్స్ పురస్కారం ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఆరోగ్య సేవలందించడంతో వీరు కీలకంగా ఉన్నారని, కరోనా మహమ్మారి సమయంలో అలుపెరగని విధంగా శ్రమించారని కొనియాడుతూ ఆదివారం నాడు ఆశ వర్కర్లకు గ్లోబల్ హెల్త్ లీడర్స్ పురస్కారంతో సత్కరించింది.
ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యవంతమైన సమాజం కోసం, స్థానిక ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ముందుండి నిబద్ధతతో పనిచేసిన ఆరు సంస్థలు, వ్యక్తులకు డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ పురస్కారాలు ప్రకటించారు. ఈ సంస్థల్లో భారత ప్రభుత్వం తరఫున పనిచేస్తున్న 10 లక్షల మంది ఆశా(అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్స్)లు కూడా ఉన్నారు. ఆశా వర్కర్లతో పాటు మరో ఐదింటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) అవార్డులు ప్రకటించింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ గ్లోబల్ హెల్త్ లీడర్స్ అవార్డును అందుకున్న తర్వాత ఆశా వర్కర్లను ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం అభినందనలు తెలిపారు. ఆరోగ్యకరమైన భారతదేశానికి భరోసా ఇవ్వడంలో ఆశా వర్కర్లు ముందంజలో ఉన్నారని అన్నారు. "ఆశా కార్యకర్తలందరికీ అభినందనలు. ఆరోగ్యవంతమైన భారతదేశానికి భరోసా ఇవ్వడంలో వారు ముందున్నారు. వారి అంకితభావం, సంకల్పం ప్రశంసనీయం" అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.