
ఎంఐఎం పార్టీ అధినేత అసుదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ వెలుపల కూడా తమ పార్టీ కార్యకలాపాలను విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎంఐఎం పార్టీ బరిలో నిలుస్తుంది. ఆయా రాష్ట్రాల్లో తమకు బలం ఉందని భావిస్తున్న ప్రాంతాల్లో అభ్యర్థులను నిలుపుతూ కొన్నిచోట్ల విజయాలనే సొంతం చేసుకుంటుంది. తాజాగా అసదుద్దీన్ ఒవైసీ.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించారు. కర్ణాటకలో 100 స్థానాల్లో ఎంఐఎం పోటీ చేస్తుందని అసదుద్దీన్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.
మరో రెండు, మూడు నెలల్లో కర్ణాటకలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎన్నికల షెడ్యూల్ వెలువడకపోయినప్పటికీ.. ప్రధాన రాజకీయా పార్టీలు కొంతకాలంగా జనం మధ్య ఉంటూ ప్రచారాన్ని సాగిస్తున్నాయి. ఎన్నికలు ఎప్పుడొచ్చిన ఎదుర్కొనేందుకు సిద్దం అయ్యాయి. అభ్యర్థుల ఎంపికపై కూడా పార్టీలు దృష్టి సారించాయి. అయితే కర్ణాటక ఎన్నికల బరిలో నిలవాలనే నిర్ణయంతో ఉన్న అసదుద్దీన్ ఒవైసీ కూడా.. ముందుగానే తమ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. కర్ణాటకలోని మూడు అసెంబ్లీ స్థానాలలో ఎంఐఎం నుంచి బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.
రాబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బెలగావి నార్త్ నియోజకవర్గం నుంచి లతీఫ్ ఖాన్ పఠాన్, హుబ్లీ ధర్వాడ్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి దుర్గప్ప కషప్ప బిజావాడ్, బసవన భాగేవాడి నియోజకవర్గం నుంచి అల్లాబక్ష్ మోహబూబ్ సాబ్ బీజాపూర్ పోటీ చేయనున్నట్టుగా తెలిపారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ పేరుతో ప్రకటన విడుదలైంది.