
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి (Asaduddin Owaisi) జెడ్ కేటరిగి (Z category) భద్రత కల్పించనున్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అసదుద్దీన్ కారుపై దుండగులు కాల్పులు జరిపిన నేపథ్యంలో.. ఆయనకు భద్రత పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అసదుద్దీన్ భద్రతపై సమీక్ష జరిపిన కేంద్ర హోంశాఖ.. సీఆర్పీఎఫ్తో జెడ్ కేటగిరి భద్రతా కల్పించాలని నిర్ణయం తీసుకుంది. తక్షణమే అసదుద్దీన్కు ఈ భద్రత అమల్లోకి రానుంది.
ఇక, యూపీలో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకొని ఢిల్లీకి వెళ్లున్న సమయంలో అసదుద్దీన్ ఓవైసీపీ కాన్వాయ్ పై మీరట్ లోని కితౌద్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు దిగారు. కాల్పులు జరిపిన వెంటనే ఒకరిని అదుపులోకి తీసుకొన్నారు. ఇవాళ మరొకరిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ‘ఒక నిర్దిష్ట మతానికి వ్యతిరేకంగా అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలతో బాధపడ్డామని నిందితులు చెప్పారు. వారిని కోర్టు ముందు హాజరు పరుస్తాము’ అని ఏడీజీ (లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ తెలిపారు.
వివరణాత్మక విచారణ, సీసీటీవీ ఫుటేజీలో ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తుల ప్రమేయం ఉందని తేలిందని ప్రశాంత్ కుమార్ చెప్పారు. కొద్ది గంటల్లోనే ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు.. ఘటనకు ఉపయోగించిన ఆయుధం, కారు స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు.
‘నేను మీరట్లోని కితౌర్లో ఎన్నికల కార్యక్రమం తర్వాత ఢిల్లీకి బయలుదేరుతున్నాను. ఛజర్సీ టోల్ ప్లాజా దగ్గర ఇద్దరు వ్యక్తులు నా వాహనంపై 3-4 రౌండ్ల బుల్లెట్లు కాల్చారు. కాల్పులు జరిపిన దుండగులు ముగ్గురునలుగురు ఉన్నారు. కాల్పుల కారణంగా నా వాహనం టైర్లు పంక్చర్ అయ్యాయి. నేను వేరే వాహనంపై బయలుదేరాను. అయితే మాకెవరికీ గాయాలు కాలేదు. అలా దయ వల్ల మేము క్షేమంగా ఉన్నాం’ అని అసదుద్దీన్ చెప్పారు. ఈ ఘటనపై ఎన్నికల సంఘం స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని కోరారు.
తన కాన్వాయ్ పై దాడి ఘటనకు సంబంధించి ఓవైసీ పార్లమెంట్ లో ప్రస్తావించనున్నారు. మరో వైపు ఈ విషయమై లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు కూడా ఆయన ఫిర్యాదు చేయనున్నట్టుగా తెలిపారు. మరో వైపు అసదుద్దీన్ ఓవైసీ సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ కూడా గురువారం నాడు అర్దరాత్రి ఢిల్లీకి చేరుకొన్నారు.