రేపు హైదరాబాద్‌కు కేజ్రీవాల్.. సీఎం కేసీఆర్‌తో భేటీ కానున్న ఆప్ అధినేత..

By Sumanth KanukulaFirst Published May 26, 2023, 3:15 PM IST
Highlights

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ రేపు హైదరాబాద్‌కు రానున్నారు. హైదరాబాద్‌ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో కేజ్రీవాల్‌తో సమావేశం కానున్నారు.

హైదరాబాద్‌: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ రేపు హైదరాబాద్‌కు రానున్నారు. హైదరాబాద్‌ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో కేజ్రీవాల్‌తో సమావేశం కానున్నారు.  ఢిల్లీలో అధికారుల పోస్టింగ్‌, బదిలీలకు సంబంధించి కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా అరవింద్ కేజ్రీవాల్  విపక్షాల మద్దతు కూడగడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే పలు విపక్ష పార్టీల నేతలను కలుస్తున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్‌ను కలిసి కేంద్రం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా మద్దతు కోరేందుకు కేజ్రీవాల్ హైదరాబాద్‌కు వస్తున్నారు. అదే సమయంలో ఇరువురు సీఎంల భేటీలో జాతీయ రాజకీయాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. 

ఇదిలా ఉంటే.. ఢిల్లీలో అధికారుల పోస్టింగ్‌, బదిలీలకు సంబంధించి కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా విపక్షాల మద్దతు కూడగట్టేందుకు కేజ్రీవాల్‌ దేశంలోని పలు విపక్ష పార్టీలను కలుస్తున్నారు. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ ఇప్పటికే పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్‌‌లతో సమావేశమయ్యారు. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని ఈ సందర్భంగా ఆయా పార్టీలను కోరారు.

మరోవైపు కాంగ్రెస్‌ను కూడా మద్దతు కోరేందుకు కేజ్రీవాల్ సిద్దమయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో భేటీకి సమయం కోరినట్టుగా అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు ఉదయం వెల్లడించారు. ‘‘బీజేపీ ప్రభుత్వం ఆమోదించిన అప్రజాస్వామిక, రాజ్యాంగ విరుద్ధమైన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా పార్లమెంటులో కాంగ్రెస్ మద్దతు కోరడానికి.. సమాఖ్య నిర్మాణంపై జరుగుతున్న దాడి, ప్రస్తుత రాజకీయ పరిణామాలను చర్చించడానికి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ‌లను కలవడానికి ఈ ఉదయం సమయం కోరడం జరిగింది’’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. 
 

click me!