
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ ప్రజలను ఉద్దేశించి ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వర్చువల్గా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. పెరుగు, లస్సీ, గోధుమలు, బియ్యం, ఇతర ఆహార పదార్థాలపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించడం దారుణం అని అన్నారు. బ్రిటిషర్లు కూడా ఇలాగే వ్యవహిరంచేవారని పేర్కొన్నారు. అంతేకాదు, ఈ జీఎస్టీ పెంపు కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కాబట్టి, వెంటనే ఈ జీఎస్టీని వెనక్కి తీసుకోవాలని కేంద్రానికి అప్పీల్ చేశారు.
ద్రవ్యోల్బణంతో ప్రజలు నేడు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని కేజ్రీవాల్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం లస్సీ, పెరుగు, గోధుమలు, బియ్యం, ఇతర ఆహార పదార్థాలపై జీఎస్టీ విధించిందని తెలిపారు. ఆంగ్లేయులు కూడా ఇదే విధంగా పన్నులు వేసేవారని చెప్పారు. ఈ ద్రవ్యోల్బణం నుంచి ఢిల్లీ ప్రజలకు తాము కొంత ఉపశమనం ఇచ్చామని వివరించారు.
తాము వైద్య చికిత్స, నీరు, విద్యుత్ ఉచితంగా అందిస్తున్నామని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. తాము అవినీతికి చరమగీతం పాడినందునే ఈ పనులన్నీ చేపట్టగలుగుతున్నామని వివరించారు. తాము ఏ పన్నునూ పెంచలేదని అన్నారు. పెంచిన జీఎస్టీని వెంటనే వెనక్కి తీసుకోవాలని తాను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు వివరించారు. ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లోనూ ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, తద్వారా ఈ ద్రవ్యోల్బణం నుంచి మీరు కూడా ఉపశమనం పొందవచ్చని పేర్కొన్నారు.
ఆప్ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నదని కేజ్రీవాల్ అన్నారు. ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయని చెప్పారు. కానీ, వాటిని చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. హిమాచల్ ప్రదేశ్లో మీరు నిజాయితీగా వ్యవహరించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. మనం రాష్ట్రాన్ని, దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నదని వివరించారు.
ఇదిలా ఉండగా, ఢిల్లీలోని ఆప్ కార్యాలయం ఎదుట బీజేపీ నేతలు ధర్నా కు దిగారు. అరవింద్ కేజ్రీ వాల్ ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీ ని అమలు చేయ డంలో అవకతవకలు ఉన్నాయని ఆరోపిస్తూ వారు ఆందోళనలు చేశారు.