
Arvind Kejriwal on tour in Gujarat: ఆమ్ ఆద్మీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ పర్యటనలో ఉన్నారు. అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ), కాంగ్రెస్లపై తీవ్ర స్థాయిలో విమర్శలతో విరుచుకుపడ్డారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ), కాంగ్రెస్ పార్టీలు సంపన్నులకు కొమ్ముకాసే పార్టీలని ఆరోపించారు. గుజరాత్లోని చదేలియా గ్రామానికి చేరుకున్న కేజ్రీవాల్.. గుజరాత్లోని ఆరున్నర కోట్ల మంది ప్రజలకు వేదికపై నుంచి పాదాభివందనం చేస్తూ.. 'ఇది మా తొలి బహిరంగ సభ కాబట్టి గిరిజనులతోనే ముందుకు సాగుతూ ప్రారంభించాం' అని అన్నారు. రాష్ట్రంలో గిరిజన పరిస్థితులను గురించి కూడా ఆయన మాట్లాడారు. గిరిజనులపై చాలా దారుణాలు జరిగాయని అన్నారు. ఈ క్రమంలోనే బీజేపీ, కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ రెండు పార్టీలు సంపన్నులకు అండగా నిలుస్తూ రోజురోజుకూ సంపన్నులను మరింత సంపన్నులను చేస్తున్నాయన్నారు.
ఆరు వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారు. లక్షలాది మంది పిల్లల భవిష్యత్తును నాశనం చేశారి గుజరాత్ ప్రస్తుత బీజేపీ సర్కారుపై ఆరోపణలు చేశారు. "మీరు మా పార్టీకి అవకాశం ఇవ్వండి.. మేము పాఠశాలను నిర్మిస్తాము. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతాం. ఈరోజు ఢిల్లీ రూపురేఖలను ఎలా మార్చామో.. గుజరత్ ను కూడా అలా తీర్చిదిద్దుతాము.. ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల మాదిరిగా ఇక్కడ పరిస్థితులను మెరుగుపరుస్తాం" అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తాను గుజరాత్ లోని ఆరున్నర కోట్ల మందితో సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి వచ్చానని చెప్పారు. "కేజ్రీవాల్ కూడా చాలా భావోద్వేగంతో ఉంటారని, తన హృదయంతో సంబంధాలను పెంచుకుంటారని నేను మీకు చెప్పడానికి వచ్చాను. అలాగే జీవితం కూడా ఆ సంబంధాన్ని పోషిస్తుంది" అని అన్నారు. "ఈరోజు ఆరున్నర కోట్ల మందితో సంబంధాలు పెట్టుకోవడానికి వచ్చానని.. రాజకీయాలు చేయడం తెలియదు.. డర్టీ పాలిటిక్స్, దొంగతనం, అవినీతి అస్సలు తెలియదు" అని అరవింద్ కేజ్రీవాల్ పురుద్ఘాటించారు.
గుజరాత్లోని పాఠశాలల పరిస్థితి నిజంగా అధ్వాన్నంగా ఉందని ఆయన పేర్కొన్నారు. "గుజరాత్లో 6,000 ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. మరికొన్ని శిథిలావస్థలో ఉన్నాయి. లక్షలాది మంది పిల్లల భవిష్యత్తు అస్తవ్యస్తమైంది. ఈ భవిష్యత్తును మనం మార్చగలం. ఢిల్లీలో పాఠశాలలను మార్చిన విధానంగానే" అని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు. ఈ క్రమంలోనే బీజేపీ నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్కు సవాలు విసిరారు. "గుజరాత్లో పరీక్షల సమయంలో పేపర్ లీక్లో బీజేపీ ప్రపంచ రికార్డు సృష్టిస్తోందని, పేపర్ లీక్ లేకుండా ఒక్క పరీక్ష నిర్వహించాలని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్కు నేను సవాల్ చేస్తున్నానని" ఆయన అన్నారు. ఈ క్రమంలోనే "మాకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఈ అవకాశంలో నేను పాఠశాలలను మెరుగుపరచకపోతే మీరు నన్ను తరిమికొట్టవచ్చు" అని పేర్కొన్నారు. ఢిల్లీలోని 4 లక్షల మంది విద్యార్థులు ప్రయివేటు పాఠశాలల నుండి ఢిల్లీ ప్రభుత్వం నడుపుతున్న పాఠశాలలకు మారారని పేర్కొంటూ, "ఢిల్లీలో, ధనవంతులు మరియు పేదల పిల్లలు కలిసి చదువుతున్నారు. ఢిల్లీలో ఈసారి 99.7% ఫలితాలు వచ్చాయి" అని చెప్పారు.