భారతదేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ప్రత్యేక స్వయం ప్రతిపత్తిని జమ్మూకశ్మీర్కు కల్పిస్తోన్న ఆర్టికల్ 35ఏ విషయంలో ప్రతికూల తీర్పు వస్తే ఆ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తాయని ఇంటెలిజెన్స్ వర్గాలు జమ్మూకశ్మీర్ ప్రభుత్వాన్ని హెచ్చరించాయి
భారతదేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ప్రత్యేక స్వయం ప్రతిపత్తిని జమ్మూకశ్మీర్కు కల్పిస్తోన్న ఆర్టికల్ 35ఏ విషయంలో ప్రతికూల తీర్పు వస్తే ఆ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తాయని ఇంటెలిజెన్స్ వర్గాలు జమ్మూకశ్మీర్ ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. 1954లో రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం స్థానికులు తప్పించి భారతీయులెవ్వరూ జమ్మూకశ్మీర్లో స్థిర నివాసం ఏర్పరచుకోవడం, ఆస్తులు కోనుగోలు చేయడం చట్ట విరుద్ధం.
ఈ అధికారాలను కల్పిస్తున్న 35ఏను సవాల్ చేస్తూ ఓ ఎన్జీవో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ అధికరణ భారత పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఉందని... దేశంలోని ఏ ప్రాంతంలోనైనా ఆస్తిని కలిగివుండటంతో పాటు నివసించే హక్కును ఆర్టికల్ 35 ఏ ఉల్లంఘిస్తోందని పిటిషన్లో పేర్కొంది. దీనిని రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా చేర్చారని.. ఇది రాష్ట్రపతి అధికార పరిధిలోనిది కాదని తెలిపింది.
దీనిని విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం రేపు విచారణ జరపనుంది. జమ్మూకశ్మీర్కు వ్యతిరేకంగా తీర్పు వచ్చినట్లయితే ఆ రాష్ట్రంలో తీవ్ర అలజడి రేగుతుందని.. పౌరులతో పాటు పోలీసులు తిరుగుబాటు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు రాష్ట్రప్రభుత్వానికి తెలపడంతో.. రేపు ఏం జరగబోతోందోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.