మరో పరువు హత్య.. బావమరదుల చేతిలో హతం

By ramya neerukondaFirst Published Sep 21, 2018, 3:43 PM IST
Highlights

అత్తమామలను చూసేందుకు వచ్చి.. బావమరుదుల చేతిలో హత్యకు గురైన వ్యక్తిని మనోజ్ శర్మగా గుర్తించారు. ముంబైలోని 'కాగ్' కార్యాలయంలో డాటా ఆపరేటర్‌గా మనోజ్ శర్మ పనిచేస్తున్నాడు.

మిర్యాలగూడ ప్రణయ్ పరువుహత్య ఇటీవల కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వెంటనే అలాంటి ఘటనే హైదరాబాద్ లో జరిగింది. ఇప్పుడు మరో పరువు హత్య బయటపడింది. కాకపోతే ఇది మన తెలుగు రాష్ట్రాల్లో కాదు జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో. ఇంటికి పిలిచి మరీ దారుణంగా హత్య చేశారు.

ఈనెల 18న తన అత్తమామలను చూసేందుకు వచ్చి.. బావమరుదుల చేతిలో హత్యకు గురైన వ్యక్తిని మనోజ్ శర్మగా గుర్తించారు. ముంబైలోని 'కాగ్' కార్యాలయంలో డాటా ఆపరేటర్‌గా మనోజ్ శర్మ పనిచేస్తున్నాడు.
 
మనోజ్‌ శర్మ, సోనియాలు మూడేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. సోనియా తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా ఈ పెళ్లి జరిగింది. అయితే తమ గ్రామం రావాల్సిందిగా పలుమార్లు అత్తమామలు పట్టుబట్టడంతో మనోజ్ ఎట్టకేలకు కుత్బా గ్రామానికి వెళ్లాడు. భాగ్‌పట్ జిల్లాలోని గాంగ్‌నౌలి గ్రామంలో ఉన్న తన సొంతింటి నుంచి అతను బయలుదేరినప్పడు బావమరుదులు వెంటే ఉన్నారు.

 అయితే మనోజ్ శర్మ ఇంటికి తిరిగిరాకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని బావమరుదులు, సోనియా కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేసారు. మనోజ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కుత్బా గ్రామంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా, మనోజ్ ఇటీవలే ఢిల్లీలోని కాగ్ కార్యాలయానికి బదిలీ అయ్యాడని, అత్తమామల ఇంటికి వెళ్లి వచ్చిన తర్వాత డ్యూటీలో చేరుదామని అనుకున్నాడని ఆయన సన్నిహితులు తెలిపారు.

click me!