అమృత్‌పాల్ సింగ్ ఫొటోలో ఉన్నట్టుగా లేడు.. రూపం మార్చుకున్నాడు, తలపాగా తీసేశాడు : బల్జీత్ కౌర్

By SumaBala BukkaFirst Published Mar 24, 2023, 7:29 AM IST
Highlights

ఖలిస్తాన్ వేర్పాటువాద నాయకుడు తన రూపురేఖలు మార్చుకున్నాడని, ఇప్పుడు తలపాగా ధరించడం లేదని అమృతపాల్ సింగ్‌కు ఆశ్రయం ఇస్తున్నారనే ఆరోపణలపై అరెస్టయిన హర్యానా మహిళ పోలీసులకు తెలిపింది.

హర్యానా : అమృత్‌పాల్ సింగ్, అతని సహచరుడు పాపల్‌ప్రీత్ సింగ్‌కు ఆశ్రయం ఇచ్చిన ఆరోపణలపై గురువారం రోజు తెల్లవారుజామున అరెస్టయిన బల్జీత్ కౌర్ అమృత్ పాల్ గురించి సంచలన విషయాలు బయటపెట్టింది. అమృత్‌పాల్ సింగ్ తన రూపాన్ని మార్చుకున్నాడని పోలీసులకు తెలిపింది. పోలీసులు చెబుతున్నట్లుగా ఇప్పుడు అతను తలపాగా ధరించడం లేదని ఆమె చెప్పింది.

అమృతపాల్ పంజాబ్ నుండి హర్యానాకు వచ్చి తన ఇంటికి ఎలా చేరుకున్నాడనే దానిపై బల్జీత్ కౌర్ పోలీసుల తెలిపింది. మార్చి 18న, అమృత్ పాల్ సింగ్, తన సహచరుడు పాపల్‌ప్రీత్ సింగ్‌తో కలిసి జూపిటర్ స్కూటర్‌పై లూథియానా మీదుగా పాటియాలా చేరుకుని తన సహాయకులలో ఒకరి ఇంట్లో ఆశ్రయం పొందాడు. మరుసటి రోజు, ఇద్దరూ ఒకే వాహనంపై హర్యానాకు బయలుదేరి షహాబాద్‌లోని బల్జీత్ కౌర్ ఇంటికి చేరుకున్నారు.  బల్జీత్ కౌర్‌కు పాపల్‌ప్రీత్ సింగ్ తెలుసు.

అమృత్‌పాల్ సింగ్ రాస‌లీల‌లు మాములుగా లేవుగా.. వీడియో కాల్‌లో ముద్దులు.. వివాహేతర సంబంధాలు

బల్జీత్ సోదరుడు అమృత్ పాల్ సింగ్ ను గుర్తించాడు, అయితే, అమృత్ పాల్ సింగ్, పాపల్‌ప్రీత్ సింగ్ లు.. తాము ఇక్కడ ఉన్నట్లు ఎవరికీ తెలియజేయవద్దని వారు అతనిని ఒప్పించారు. తర్వాత, అమృతపాల్ కొన్ని ముఖ్యమైన కాల్స్ చేయడానికి బల్జీత్ సోదరుడి ఫోన్‌ను కూడా వాడుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మార్చి 20న, పాపల్‌ప్రీత్ బల్జీత్ కౌర్ ఇంటి నుండి బయలుదేరే ముందు ఆ ప్రాంతంలోని బస్ స్టాప్‌లు, రోడ్ల మీద పోలీసులు ఉన్నారా.. ఎలా వెడితే సేఫ్ అని రెక్కీ కూడా చేసినట్టుగా తెలిపారు.

అమృతపాల్, బల్జీత్ ఇంటి నుండి బయలుదేరే ముందు, తాము పాటియాలానుండి వచ్చిన స్కూటర్, కొన్ని వస్తువులను తిరిగి పాటియాలాలో ఇవ్వమని ఆమె సోదరుడిని అడిగాడు.  బల్జీత్‌ కౌర్ తో చేసిన అన్ని కాల్ రికార్డ్‌లు, సోషల్ మీడియా చాట్‌లను డిలీట్ చేశారు. తను ఎక్కడుందీ ఎవరికీ వెల్లడించవద్దని ఆమెకు సూచించాడని పోలీసులు తెలిపారు.

వారిస్ పంజాబ్ ది చీఫ్, అతని సహచరులపై పంజాబ్ పోలీసులు భారీ వేట ప్రారంభించినప్పటి నుండి అమృతపాల్ సింగ్ పరారీలో ఉన్నాడు. అతని కోసం జరుపుతున్న వేట శుక్రవారానికి 7వ రోజులోకి ప్రవేశించింది. 50కి పైగా కార్లతో గత వారం అమృతపాల్ సింగ్‌ను పోలీసులు వెంబడించారు. కానీ అతను పంజాబ్ పోలీసుల కళ్లుగప్పి మాయమయ్యాడు. ఖలిస్తానీ నాయకుడు దేశం విడిచి పారిపోయేందుకు ప్లాన్ చేస్తున్నాడు. 

click me!