
Prime Minister Narendra Modi: గ్రీన్ గ్రోత్ అనే అంశంపై బడ్జెట్ అనంతర తొలి వెబినార్ లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ గ్రీన్ ఎనర్జీ మార్కెట్లో భారత్ అగ్రగామిగా నిలిచేందుకు ఈ బడ్జెట్ దోహదపడుతుందన్నారు. ఇంధన ప్రపంచంతో సంబంధం ఉన్న భాగస్వాములందరినీ భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని తాను ఆహ్వానిస్తున్నానని తెలిపారు. కేంద్ర బడ్జెట్ ప్రకటించిన కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడానికి ఆలోచనలు, సలహాలను కోరేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న 12 పోస్ట్ బడ్జెట్ వెబినార్ లలో ఇది మొదటిది.
ఈ వెబినార్ లో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. హరిత వృద్ధి, ఇంధన పరివర్తన కోసం పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని పెంచడం, శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించడం, గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థతో ముందుకు సాగడం వంటి మూడు స్తంభాలను భారత్ ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. కాగా, ఏడాదికి 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్న భారత్.. జాతీయ హైడ్రోజన్ మిషన్ కింద ప్రయివేటు రంగానికి రూ.19,000 కోట్ల ప్రోత్సాహకాన్ని అందించింది.
"ఈ బడ్జెట్ ప్రపంచ గ్రీన్ ఎనర్జీ మార్కెట్లో భారత్ ను అగ్రగామిగా నిలుపుతుంది. ఇంధన ప్రపంచంతో సంబంధం ఉన్న భాగస్వాములందరినీ భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని నేను ఆహ్వానిస్తున్నాను" అని గ్రీన్ గ్రోత్ పై బడ్జెట్ అనంతర మొదటి వెబినార్ లో ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. పునరుత్పాదక ఇంధన రంగంలో భారతదేశం కమాండింగ్ పొజిషన్ లో ఉండటం వల్ల ప్రపంచంలో తగిన మార్పు వస్తుందని ప్రధాన మంత్రి అన్నారు. గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ మార్కెట్లో భారత్ ను అగ్రగామిగా నిలబెట్టడంలో ఈ బడ్జెట్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అందుకే, ఈ రోజు, ఇంధన ప్రపంచంలోని ప్రతి వాటాదారుని భారతదేశంలో పెట్టుబడులు పెట్టమని తాను ఆహ్వానిస్తున్నాని ప్రధాని తన సందేశంలో పేర్కొన్నారు. ఇంధన సరఫరా గొలుసు వైవిధ్యీకరణ కోసం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నాలను ప్రస్తావిస్తూ, ఈ బడ్జెట్ ప్రతి గ్రీన్ ఎనర్జీ ఇన్వెస్టర్ కు భారత్ లో పెట్టుబడులు పెట్టడానికి గొప్ప అవకాశాన్ని కల్పించిందని చెప్పారు. ఈ రంగంలోని స్టార్టప్ లకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు.
ఇథనాల్ బ్లెండింగ్, పీఎం కుసుమ్ స్కీమ్, సోలార్ తయారీని ప్రోత్సహించడం, రూఫ్ టాప్ సోలార్ స్కీమ్, కోల్ గ్యాసిఫికేషన్, ఈవీ బ్యాటరీ స్టోరేజ్ వంటి హరిత వృద్ధి దిశగా అనేక నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. హరితవృద్ధికి, ఇంధన ప్రసారానికి మూడు స్తంభాలు ఉన్నాయని పేర్కొన్న ప్రధాని.. వాటిని పునరుత్పాదక శక్తి ఉత్పత్తిని పెంచడం మొదటిదని తెలిపారు. రెండవది, ఆర్థిక వ్యవస్థలో శిలాజ ఇంధన వాడకాన్ని తగ్గించడంగా పేర్కొన్నారు. ఇక మూడోది దేశంలో గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ వైపు వేగంగా కదలడమని చెప్పారు.