
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్లో కశ్మీరీ పండిట్లు బిక్కు బిక్కుమంటూ జీవించాల్సిన దుస్థితి ఉన్నది. కశ్మీరీ పండిట్లను, కశ్మీర్కు ఉపాధి నిమిత్తం ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు. చంపేస్తున్నారు. గత నెల రెవెన్యూ ఉద్యోగి, కశ్మీరీ పండిట్ రాహుల్ భట్ మరణంతో కశ్మీర్ లోయలో ఆందోళనలు రేగాయి. కశ్మీరీ పండిట్ల నిరసనలు మొదలయ్యాయి. గురువారం ఉగ్రవాదులు ఓ బ్యాంక్ మేనేజర్, ఇటుక బట్టిలో కార్మికుడిని ఉగ్రవాదులు కాల్చి చంపేశారు. ఈ నేపథ్యంలో
కశ్మీరీ పండిట్ల నుంచి నిరసనలు మరింత పెరిగాయి. తమను సురక్షిత ప్రాంతాలకు బదిలీ చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్లు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
శ్రీనగర్లో విధులు నిర్వహిస్తున్న 177 మంది కశ్మీరీ పండిట్ టీచర్లను సురక్షిత ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేశారు. కశ్మీరీ పండిట్లను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. జమ్ము కశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే టీచర్ల బదిలీ నిర్ణయం వెలువడటం గమనార్హం.
2012లో ప్రధానమంత్రి ప్రత్యేక ప్యాకేజీ కింద కశ్మీరీ పండిట్లకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. వారందరూ ఇప్పుడు తమను కశ్మీర్ లోయ నుంచి జమ్ము రీజియన్ లేదా ఇతర సురక్షిత ప్రాంతాలకు బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే.. మళ్లీ సామూహిక వలసలుగా వెళ్తామని హెచ్చరించారు. రాహుల్ భట్ మరణం తర్వాత ఈ డిమాండ్ మరింత గట్టిగా వినిపిస్తున్నారు. భట్ మరణం తర్వాత సుమారు 6000 మంది ఉద్యోగులు కశ్మీర్ లోయలోని వివిధ ప్రాంతాల్లో నిరసనలు చేశారు. రాహుల్ భట్ హత్య తర్వాత ఉగ్రవాదుల దాడులు పెరుగుతూనే వచ్చాయి.
మే 1వ తేదీ నుంచి లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు చంపేస్తున్నవారి సంఖ్య తొమ్మిదికి చేరింది. కశ్మీర్లోని ఓ బ్యాంకులో మేనేజర్గా చేస్తున్న రాజస్తాన్కు చెందిన విజయ్ కుమార్ హత్య ఎనిమిదవది. ఆయన తర్వాత ఓ ఇటుక బట్టిలో పని చేస్తున్న కార్మికుడినీ చంపేశారు.
జమ్ము కశ్మీర్ బుడ్గాం జిల్లాలో టెర్రరిస్టులు కశ్మీర్ పండిట్ రాహుల్ భట్ను గత నెల హతమార్చారు. రాహుల్ భట్ హత్యపై కశ్మీర్ లోయలో కశ్మీరీ పండిట్లు ఆందోళనలు చేస్తున్నారు. జమ్ము కశ్మీర్, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ భట్ భార్య మీనాక్షి భట్ ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. చదూరాలో తన భర్త పని చేసేటప్పుడు ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యాడని వివరించారు. అందుకే తనను జిల్లా హెడ్క్వార్టర్కు బదిలీ చేయాలని రాహుల్ భట్ పలుమార్లు స్థానిక అధికారులకు విజ్ఞప్తి చేశారని తెలిపారు. పలుమార్లు చేసిన ఆయన విజ్ఞప్తులను అధికారులు పట్టించుకోలేదని, ఆయనను బదిలీ చేయలేదని ఆవేదన చెందారు.
ప్రధాని నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షాలు కశ్మీరీ పండిట్లను బలిపశువులను చేస్తున్నారని ఆమె విమర్శించారు. వారు తమ రాజకీయాల కోసం కశ్మీరీ పండిట్లను ఇంధనంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. దమ్ముంటే వారు కశ్మీర్ వచ్చి సెక్యూరిటీ లేకుండా తిరగాలని సవాల్ విసిరారు. కశ్మీర్ పండిట్లు తీవ్ర అణచివేతను ఎదుర్కొంటున్నారని అన్నారు. కానీ, ఈ దేశం తమ బాధను చూస్తూ కూడా మౌనంగా ఉంటున్నదని ఆవేదన వ్యక్త పరిచారు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలు కశ్మీర్ పండిట్లపై పూర్తిగా భిన్న వైఖరిని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.