
తమిళనాడులోని కున్నూరులో బుధవారం జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాద ఘటన పార్థివ దేహాలను తరలిస్తున్న అంబులెన్సుకు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన జనరల్ బిపిన్ రావత్ సహా 11 మంది మృతదేహాలను ఢిల్లీకి తరలించేందుకు గురువారం కున్నూర్ నుంచి సూలూరు ఎయిర్బేస్కు అంబులెన్సుల్లో తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. కోయంబత్తూరు వద్ద ఈ అంబులెన్సు ముందు వెళుతున్న మరో అంబులెన్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ప్రమాదానికి గురైన అంబులెన్సులోని పార్థివ దేహాలను మరో అంబులెన్సులోకి ఎక్కించారు.
కాగా హెలికాఫ్టర్ ప్రమాద మృతులకు అంబులెన్సులు వెళుతున్న మార్గంలోని స్థానికులు నివాళులర్పించారు. వాహనశ్రేణిపై పూలు చల్లుతూ ‘భారత్ మాతాకీ జై’ అంటూ నినదించారు. దీంతో ఆ ప్రాంతమంతా ఉద్విగ్నభరిత వాతావరణం నెలకొంది. మరోవైపు రావత్ సహా సైనిక సిబ్బంది పార్థివ దేహాలు దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నాయి. తమిళనాడు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీలోని పాలెం ఎయిర్బేస్కు మృతదేహాలను తీసుకొచ్చారు. కాసేపట్లో ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు, త్రివిధ దళాధిపతులు, పలువురు ప్రముఖులు నివాళులర్పించనున్నారు.
కాగా.. నీలగిరి జిల్లా వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కళాశాలలో సిబ్బంది, శిక్షణలో ఉన్న అధికారులను ఉద్దేశించి జనరల్ బిపిన్ రావత్ బుధవారం ప్రసంగించాల్సి ఉంది. ఇందుకోసం భార్య మధులిక రావత్, మరికొంతమంది సైనిక ఉన్నతాధికారులతో కలిసి ఆయన ఢిల్లీ నుంచి బుధవారం ఉదయం తమిళనాడు బయలుదేరారు. బుధవారం ఉదయం 11.34 గంటలకు కోయంబత్తూరు జిల్లా సూలూర్కు చేరుకున్నారు. అక్కడి నుంచి 11:48 గంటలకు భారత వాయుసేనకు చెందిన ఎంఐ-17వీ5 హెలికాప్టర్లో వెల్లింగ్టన్కు బయలుదేరారు.
అయితే మధ్యాహ్నం 12.20 గంటల ప్రాంతంలో హెలికాఫ్టర్ కున్నూరు సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాందలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ (Gen Bipin Rawat), ఆయన భార్య మధులికా రావత్ (Madhulika Rawat) సహా 13 మంది మృతి చెందారు. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ (group captain varun singh) ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. ఆయనకు ప్రస్తుతం బెంగళూరులోని ఎయిర్ఫోర్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.
అంతకుముందు హెలికాఫ్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ (Gen Bipin Rawat) , ఆయన సతీమణి మధులికా రావత్, ఇతర సీనియర్ అధికారులకు పార్లమెంట్ ఉభయసభలలో శ్రద్దాంజలి ఘటించారు. వారి మృతిపట్ల ఉభయసభలు సంతాపం వ్యక్తం చేశాయి. లోక్సభ, రాజ్యసభ సభ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.ఈ ప్రమాదానికి సంబంధించి తొలుత లోక్సభలో, తర్వాత రాజ్యసభలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ (Defence Minister Rajnath Singh) సింగ్ ప్రకటన చేశారు.