దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన పశ్చిమబెంగాల్, అసోం, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్కు భారత ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది
దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన పశ్చిమబెంగాల్, అసోం, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్కు భారత ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలవుతుంది.
ఓట్ల లెక్కింపు కోసం 822 ఆర్ఓలు, 7000కు పైగా ఏఆర్ఓలను ఏర్పాటు చేసినట్టు ఎన్నికల కమిషన్ తెలియజేసింది. కౌంటింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లతో సహా సుమారు 95,000 కౌంటింగ్ అధికారులు కౌంటింగ్ పక్రియ టాస్క్ను పర్యవేక్షిస్తారని ఆ ఉత్తర్వుల్లో ఈసీ తెలిపింది.
ఈసారి కౌంటింగ్ హాల్స్ను 200 శాతం పెంచినట్టు ఈసీ తెలిపింది. 2016 ఎన్నికల్లో 1002 కౌంటింగ్స్ హాల్స్ ఏర్పాటు చేయగా, ఈసారి 2364 కౌంటింగ్స్ హాల్స్ ఏర్పాటు చేసినట్టు పేర్కొంది. కోవిడ్ నేపథ్యంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నట్టు ఈసీ తెలిపింది.
ఓట్ల లెక్కింకు దృష్ట్యా కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో కఠిన చర్యలను చేపట్టింది. ఆర్టీ-పీసీఆర్/ఆర్ఏటీ టెస్టులు చేయించుకోవడం కానీ, 2 డోసుల వ్యాక్సిన్ తీసుకోవడం కానీ చేయని అభ్యర్థులు, ఏజెంట్లను ఎట్టిపరిస్ధితుల్లోనూ కౌంటింగ్ హాల్స్లోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది.
హెల్త్ సేఫ్టీ ప్రోటోకాల్స్ కఠినంగా అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకున్నామని పేర్కొంది. పశ్చిమబెంగాల్లో 256 కంపెనీల కేంద్ర బలగాలను ఈసీ మొహరించింది. అసోం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలోనూ ఇదే తరహా ఏర్పాట్లు చేసింది.
నాగార్జున సాగర్:
మరోవైపు నాగార్జునసాగర్ ఉప ఎన్నికల కౌంటింగ్కు ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. శనివారం ఉదయం కౌంటింగ్ రిహార్సల్స్ నిర్వహించారు.
కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, కేంద్ర ఎన్నికల పరిశీలకులు సజ్జన్ సింగ్ చవాన్, ఆర్ ఓ రోహిత్ సింగ్ లు ఏర్పాట్లను, రిహార్సల్స్ ను పర్యవేక్షిస్తున్నారు. 25 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుంది. ఒక్కో రౌండ్ లో 14 టేబుల్స్ పై కౌటింగ్ జరుగనుంది. మొత్తం రెండు హాల్స్ ను ఏర్పాటు చేసిన అధికారులు ఒక్కో హాల్లో ఏడు కౌంటింగ్ టేబుల్స్ ద్వారా ఓట్లను లెక్కించనున్నారు.
తిరుపతి ఉప ఎన్నిక:
అటు తిరుపతి ఉప ఎన్నికకు కూడా అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. గరిష్ఠంగా 25 రౌండ్లు ఉంటాయి. తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కాలేజీలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
కౌంటింగ్ అధికారులకు, ఏజెంట్లకు కరోనా పరీక్షలు చేశారు. నెగెటివ్ రిపోర్టు వచ్చినవారినే కౌంటింగ్ కేంద్రం లోపలికి అనుమతించనున్నారు. తొలుత పోస్టల్ బ్యాలెట్లు, ఆపై ఈవీఎం ఓట్లను లెక్కించనున్నారు. ఒక్క తిరుపతి సెగ్మెంట్ కోసమే 4 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి కౌంటింగ్ కేంద్రంలో 6 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేశారు.