
Agnipath protests: గత మూడురోజుల నుంచి దేశవ్యాప్తంగా కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆందోళన వల్ల ఇప్పటివరకు 340 రైళ్లు ప్రభావితమయ్యాయి. వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం కనుగొనే మార్గాన్ని అవలంబించాలని, దేశ ఆస్తులను దెబ్బతీయవద్దని నిరసన తెలుపుతున్న విద్యార్థులకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ విజ్ఞప్తి చేశారు.
ఈ విధ్వంసాన్ని ఆపాలని, నిరసనకారులు సంయమనం పాటించాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని,తాను ప్రతి ఒక్కరినీ కోరుతున్నాననీ, దయచేసి రైల్వే ఆస్తులను నాశనం చేయవద్దని అన్నారు. రైల్వే ఆస్తి మనందరి ఆస్తి. జాతీయ ఆస్తి అని మంత్రి అన్నారు. ఇప్పటివరకు అగ్నిపథ్ నిరసనల కారణంగా రైల్వేకు రూ.40 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని అంచనా.
రైలు కోచ్ను తయారీకి ఎంత ఖర్చు అవుతుందంటే?
నాన్ ఏసీ ఐసీఎఫ్ కోచ్ తయారీకి రూ.90 లక్షలు, ఏసీ ఐసీఎఫ్ కోచ్ తయారీకి రూ.1.5 కోట్లు ఖర్చవుతోంది. నాన్ ఏసీ ఎల్హెచ్బీ కోచ్ తయారీకి రూ.2.25 కోట్లు ఖర్చు అవుతోంది. మరోవైపు, AC LHB కోచ్ను తయారు చేయడానికి 3 కోట్లు పడుతుంది. రైలు ఇంజిన్ను తయారు చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. 5 వేల హార్స్ పవర్ ఉన్న ఇంజన్ తయారీకి రూ.15 కోట్లు, 12 వేల హార్స్ పవర్ ఉన్న ఇంజిన్ తయారీకి రూ.65 కోట్లు ఖర్చు అవుతోంది. సాధారణ రైలులో 24 కోచ్లు ఉంటాయి. అంటే, ఇంజిన్తో సహా పూర్తి రైలు సగటు ధర కనీసం రూ.51 కోట్లు.
అగ్నిపథ్ నిరసన కారణంగా రైల్వేకు తీవ్ర నష్టం
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనల్లో 7 ఎల్హెచ్బి కోచ్లు, 5 జనరల్ ఐసిఎఫ్ కోచ్లతో సహా మొత్తం 12 కంటే ఎక్కువ కోచ్లు కాలిపోయాయి. ఆందోళన కారణంగా మొత్తం 340 రైళ్లు ప్రభావితమయ్యాయి. వీటిలో 94 మెయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లు, 140 ప్యాసింజర్ రైళ్లు రద్దు చేయబడ్డాయి. ఇది కాకుండా, 65 మెయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లు, 30 ప్యాసింజర్ రైళ్లు పాక్షికంగా రద్దు చేయబడ్డాయి. దీనితో పాటు 11 మెయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లను దారి మళ్లించామని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇదిలా ఉంటే.. తెలంగాణలో కూడా ఆందోళనలు ఉద్రిక్తతంగా మారాయి. ఒక్కరూ ప్రాణాలు కోల్పోయారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిరసనకారులు చేపట్టిన ఆందోళనల్లో రూ. 7 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగిందని సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ గుప్తా స్పష్టం చేశారు. నిరసనల్లో ఐదు రైలింజన్లకు తగలబెట్టడంతో పాటు 30 బోగీలను ధ్వంసం చేశారని పేర్కొన్నారు.
స్టేషన్లోని పార్సిల్ ఆఫీసును పూర్తిగా ధ్వంసం చేశారని తెలిపారు. ఆందోళనకారుల నిరసనల నేపథ్యంలో 18 ఎక్స్ప్రెస్, 9 ప్యాసింజర్ రైళ్లు, 65 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేశామని తెలిపారు. ఇవికాక మరో 15 రైళ్లను పాక్షికంగా రద్దు చేశామని తెలిపారు. మరో 8 రైళ్లను దారి మళ్లించామని, ఓ రైలును రీషెడ్యూల్ చేశామని తెలిపారు.
మరికాసేపట్లోనే రైళ్ల సేవలను పునరుద్ధరిస్తామని డీఆర్ఎం గుప్తా స్పష్టం చేశారు. రైళ్ల పునరుద్ధరణకు చర్యలు చేపట్టామన్నారు. నిరసనలో రైలు కోచ్లకు అధికంగా డ్యామేజ్ జరిగిందని, అలాగే.. ప్లాట్ఫాంలపై ఉండే స్టాల్స్ కూడా ధ్వంసం చేశారని తెలిపారు. ప్రధానంగా ప్లాట్ ఫాం నెంబర్ 2 నుంచి 7 వరకు ఉన్న వస్తువులను ధ్వంసం చేశారని తెలిపారు.