
Prakash Raj's comments on Kiccha Sudeep's support to BJP: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ బీజేపీకి మద్దతు ప్రకటించారు. నేపథ్యంలోనే ప్రముఖ నటుడు, రాజకీయ నాయకులు ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. కిచ్చా సుదీప్ చేసిన వ్యాఖ్యల వార్తలు విని తాను ఎంతగానో ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. తనను దిగ్భ్రాంతికి గురిచేయడంతో పాటు ఎంతగానో బాధించిందని తెలిపారు.
వివరాల్లోకెళ్తే.. తాను కర్ణాటకలో అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లో చేరుతాననే ఊహాగానాల నేపథ్యంలో కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ తాను కాషాయ పార్టీ తరఫున మాత్రమే ప్రచారం చేస్తాననీ, రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. బసవరాజ్ బొమ్మైతో ఉన్న ప్రత్యేక అనుబంధంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో పక్కనే కూర్చున్న ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తాను అభిమానించే బసవరాజ్ బొమ్మైని ఆప్యాయంగా, గౌరవంగా 'మామా' అని పిలుచుకునే తాను ఆయనకు మద్దతు ప్రకటించడానికి ఇక్కడికి వచ్చానని చెప్పారు. తన కష్టకాలంలోనూ బొమ్మై మామా అండగా నిలిచారని కిచ్చా సుదీప్ పేర్కొన్నారు.
కిచ్చా సదీప్ బీజేపీకి మద్దతు ప్రకటించడంపై భిన్న అభిప్రయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే క్రమంలో ప్రముఖ నటుడు, రాజకీయ నాయకులు ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే నెలలో జరగనున్న కర్ణాటక రాష్ట్ర ఎన్నికలకు ముందు కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ బీజేపీకి మద్దతు ఇవ్వడంపై నటుడు ప్రకాశ్ రాజ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బీజేపీకి మద్దతు ప్రకటించిన సుదీప్ ఆ పార్టీ తరఫున ప్రచారం చేస్తానని, అయితే మే 10న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పారు. కిచ్చా సుదీప్ ప్రకటన తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని రాజ్ అన్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో బెంగళూరు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ప్రకాశ్ రాజ్.. బీజేపీలో కిచ్చా సుదీప్ చేరుతారనే వార్తలను తోసిపుచ్చారు.
కిచ్చా సుదీప్.. బీజేపీకి మద్దతు ప్రకటించడంపై ప్రకాశ్ రాజ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. "సుదీప్ ప్రకటనతో నేను షాక్ కు గురయ్యాను. అలాగే, ఎంతగానో బాధపడ్డాను. నిరాశలో కూరుకుపోయిన భాజపా ఈ నకిలీవార్తను వ్యాప్తి చేసిందని బలంగా నమ్ముతున్నాను. ఎవరో ఉంచిన ఎరలో పడేంత తెలివితక్కువ వ్యక్తి కాదు.. తెలివైన భారతీయుడు అంటూ" పేర్కొన్నారు.
కాగా, ప్రకాశ్ రాజ్ సామాజిక, రాజకీయ అంశాలపై గళమెత్తుతూ.. బీజేపీ ప్రభుత్వం, మోడీ సర్కారు తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై గళం విప్పుతూ పలుమార్లు విమర్శలు గుప్పించారు.