
ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (డీఈఆర్సీ) చీఫ్ నియామకానికి సంబంధించిన కేసును సుప్రీంకోర్టు సోమవారం విచారించింది. ఈ సందర్భంగా కేంద్రానికి, ఢిల్లీ ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. రెండు ప్రభుత్వాలు కలిసి కూర్చొని సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించింది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా రాజకీయ కుమ్ములాటలకు అతీతంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (డీఈఆర్సీ) ఛైర్పర్సన్ పేరును సీఎం, లెఫ్టినెంట్ గవర్నర్ కలిసి కూర్చుని నిర్ణయం తీసుకోవాలని కోర్టు పేర్కొంది. వారు రాజ్యాంగ బద్ధమైన అధికారులని, వారు గొడవలకు అతీతంగా ఎదగాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
ఈ వ్యవహారంలోకి తాము జోక్యం చేయదల్చుకోలేదని, ఇద్దరు రాజ్యాంగాధికారులు ఈ సమస్యను పరిష్కరించుకోవాలని కోరింది. ‘‘వారిద్దరూ (ఎల్జీ, ముఖ్యమంత్రి) కలిసి కూర్చొని అవసరమైన పనులు చేయాలి’’ అని కోర్టు పేర్కొంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, సీఎం కేజ్రీవాల్ ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలని సూచించింది. దీనిపై ఏ విషయాన్నీ జూలై 20వ తేదీ గురువారంలోగా కోర్టుకు తెలియజేయాలని ఆదేశించింది.
జస్టిస్ ఉమేష్ కుమార్ ను డీఈఆర్ సీ ఛైర్ పర్సన్ గా నియమించడం నగరంలోని ఆప్ ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తిని డీఈఆర్సీ చీఫ్ గా కేంద్రం నియమించడాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం దాఖలు పిటిషన్ దాఖలు చేసింది.
కాగా.. దేశ రాజధానిలో పరిపాలనా సేవలను ఎవరు నియంత్రించాలనే అంశంపై ఢిల్లీ ప్రభుత్వానికి, కేంద్రం నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్ కు మధ్య తలెత్తిన వివాదంలో సుప్రీంకోర్టు మే 11న తీర్పు వెలువరించింది. సర్వీసుల నిర్వహణలో బ్యూరోక్రాట్లపై ఢిల్లీ ప్రభుత్వానికి నియంత్రణ ఉండాలని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఢిల్లీలో ఐఏఎస్, ఐఏఎస్ అధికారుల బదిలీ, పోస్టింగ్ కోసం అథారిటీని ఏర్పాటు చేసేందుకు వీలుగా కేంద్రం మే 19న ఆర్డినెన్స్ జారీ చేసింది, ఈ చర్యను ఢిల్లీ ప్రభుత్వం తప్పుపట్టింది. ఈ చర్య సేవల నియంత్రణపై సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించడమేనని ఆరోపించింది.