భారత్ బంద్: కేజ్రీవాల్ హౌస్ అరెస్ట్.. అదేం లేదంటున్న పోలీసులు

By Siva KodatiFirst Published Dec 8, 2020, 2:52 PM IST
Highlights

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతు సంఘాలు పిలునిచ్చిన ‘భారత్ బంద్’  దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. ఈ బంధ్‌కు పలు రాజకీయ పార్టీలు, వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతు సంఘాలు పిలునిచ్చిన ‘భారత్ బంద్’  దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. ఈ బంధ్‌కు పలు రాజకీయ పార్టీలు, వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది.

రైతులకు మద్దతుగా ఉదయం నుంచే రైతు సంఘాలు, పార్టీల నేతలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ‘భారత్ బంద్’ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

సింఘా సరిహద్దుల్లో రైతుల ఆందోళనకు మద్దతు తెలిపి వచ్చినప్పటీ నుంచి ఆయనను గృహ నిర్బంధంలో ఉంచినట్టు ఆప్‌ ఆరోపించింది. కేజ్రీవాల్ నివాసం నుంచి ఎవరూ బయటకు వెళ్లడానికి కానీ, బయటవారు లోనికి ప్రవేశించడానికి కానీ పోలీసులు అనుమతించడం లేదని ఆరోపించింది.

ఈ మేరకు ఆప్‌ లీడర్‌ సౌరవ్‌ భరద్వాజ్‌ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. పోలీసులు తీరును నిరసిస్తూ ముఖ్యమంత్రి నివాసం ఎదుట ఆప్ శ్రేణులు బైఠాయించాయి. 

అయితే ఆప్ వ్యాఖ్యలను ఢిల్లీ పోలీసులు ఖండించారు. సీఎం కేజ్రీవాల్‌ను గృహ నిర్భంధంలో ఉంచామని చెప్పడం అవాస్తమని అన్నారు. తాము ఆప్, ఇతర పార్టీల మధ్య ఘర్షణ తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్టుగా పోలీసులు వెల్లడించారు.

ఈ క్రమంలోనే ట్విటర్‌లో కేజ్రీవాల్ నివాసం వద్ద ఎలా ఉందో చూడండి అని ఓ ఫొటోను పోస్ట్ చేసింది. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ కూడా స్పందించింది. పోలీసులకు, ఆప్ ఎమ్మెల్యేలకు మధ్య వాగ్వాదం జరుగుతున్న ఓ వీడియోను పోస్ట్ చేసిన ఆప్.. దయచేసి ఆధారాలను తారుమారు చేయవద్దని కోరింది. 

click me!