
భారీ వర్షం, తోడుగా పిడుగులు అన్ని వెరసి 83 మంది మరణించారు. ఇదేదో సంవత్సరం పొడవునా తీసిన లెక్క అనుకోకండి, కేవలం రెండు రోజుల వ్యవధిలో అది ఒకే రాష్ట్రం నుండి తీసిన లెక్కలు.
పిడుగుపాటు వల్ల 83 మంది మరణించిన విషాదకర సంఘటనకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. బీహార్ రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల్లో ఈ మరణాలు సంభవించాయి. రుతుపవనాలు ప్రభావం అధికంగా ఉండడంతో అక్కడ భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. తోడుగా ఈ పిడుగులు, అన్ని వెరసి ఈ ప్రాణనష్టం సంభవించింది.
రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ లెక్కలప్రకారం బీహార్ లోని దాదాపుగా 23 జిల్లాలు పిడుగుపాటు బారినపడ్తాద్యని, ఒక్క గోపాల్ గంజ్ జిల్లాలోనే 13 మంది మరణించారని వారు తెలిపారు. బీహార్ తోపాటు పక్కనున్న ఉత్తరప్రదేశ్ లో కూడా భారీగానే ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవించింది.
"బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మరణాల గురించి సమాచారం అందింది, సహాయక చర్యలు కల్పించడంలో, పునరావాసం ఏర్పాటుచేయడంలో రాష్ట్రప్రభుత్వాలు నిమగ్నమయ్యాయి" అని ప్రధాని నరేంద్రమోడీ ట్వీట్ చేసారు.
బాధిత కుటుంబాల సహాయార్థం నాలుగు లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ప్రకటించారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. ప్రజలంతా ఇండ్లలోనే ఉండాలని, ఎవ్వరు కూడా బయటకు రావద్దని ఆయన ప్రజలను కోరారు.
హోమ్ మంత్రి అమిత్ షా కూడా మరణించిన వారికి సంతాపం ప్రకటించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి కోరారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ ఎంపీ రాహులా గాంధీ కూడా ప్రజల మరణాలకు సంతాపం తెలపడంతోపాటుగా జాగ్రత్తగా మెలగమని ప్రజలను కోరారు.