
మైనర్ బాలికను కిడ్నాప్ చేసి.. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 17మంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. కాగా.. నిందితుల్లో 8మందిని తాజాగా బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో మైనర్ బాలిక బంధువులు కూడా ఉండటం గమనార్హం. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే...
చిక్ మంగుళూరుకు చెందిన బాధితురాలి తల్లి మూడేళ్ల క్రితం మరణించింది. అప్పటి నుంచి ఆమె తన బంధువుతో కలిసి నివసిస్తూ.. స్థానికంగా ఉన్న స్టోన్ క్రషర్ సంస్థలో పని చేసేది. ఈ క్రమంలో బాలికకు గిరీష్ అనే బస్ డ్రైవర్తో పరిచయం ఏర్పడింది. బాధితురాలి గురించి పూర్తిగా తెలుసుకున్న గిరీష్ ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఆ తర్వాత బాలిక దీని గురించి తన ఆంటీకి చెప్పింది. తోడుగా నిలబడాల్సిన ఆమె.. బాలికని బెదిరించి మరి కొందరి వద్దకు పంపింది. ఇక బస్ డ్రైవర్ గిరీష్ బాలికతో ఉన్న సంబంధం గురించి బయట చెప్తానని బెదిరించి స్మాల్ అభి అనే వ్యక్తి వద్దకు బాధితురాలిని పంపాడు.
అభి బాధితురాలిపై దారుణానికి ఒడిగట్టడమే కాక వీడియోలు, ఫోటోలు తీసి బెదిరించి పలుమార్లు ఆమెపై అకృత్యానికి ఒడిగట్టాడు. అతడి స్నేహితులు కూడా బాలికను అత్యాచారం చేశారు. ఇలా దాదాపు 17 మంది రాక్షసులు గత ఐదునెలలుగా బాధితురాలిపై రాక్షసకాండ కొనసాగిస్తున్నారు. దీని గురించి తెలియడంతో జిల్లా డిస్ట్రిక్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దారుణం వెలుగులోకి వచ్చింది.
ఈ కేసులో పోలీసులు తాజాగా 8మంది ని అరెస్టు చేశారు. మిగిలిన నిందితులను కూడా అదుపులోకి తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.