
ఉత్తరప్రదేశ్ మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. యూపీ లోని జౌన్ పూర్- వారణాసి రహదారిలో జలాల్ పూర్ లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఒక ట్రక్కు, పికప్ వ్యాన్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో పికప్ వ్యానులో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, ఎనిమిదిమందికి స్వల్ప గాయాలయ్యాయి. పికప్ వ్యాన్లో మొత్తం 17 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా వారణాసిలో ఒక దహన సంస్కారాల కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తున్నారు.
క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం జౌన్ పూర్ జిల్లాలోని ఖ్వాజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జలాల్పూర్ నివాసి, 112 ఏళ్ల వృద్ధుడు థన్దేయీ భార్య స్వజోఖన్ యాదవ్ మృతి చెందింది. ఆ దంపతులకు కుమారులు లేరు. దీంతో వారి అల్లుడు లక్ష్మీశంకర్ యాదవ్ తన గ్రామంలోని 17 మందిని తీసుకువచ్చి స్వజోఖన్ యాదవ్ కు వారణాసిలో దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం పూర్తయ్యాక వారంతా పికప్ వాహనంలో తరిగి వస్తుండగా, ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అలాగే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.