ఎన్నికల ఫలితాల తర్వాత త్రిపురలో 50 చోట్ల‌ హింసాత్మక ఘటనలు.. 2 జిల్లాల్లో 144 సెక్షన్‌

Published : Mar 03, 2023, 11:54 PM IST
ఎన్నికల ఫలితాల తర్వాత త్రిపురలో 50 చోట్ల‌ హింసాత్మక ఘటనలు..  2 జిల్లాల్లో 144 సెక్షన్‌

సారాంశం

Agartala: త్రిపురలో ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే రాష్ట్రంలో 50 హింసాత్మక ఘటనలు నమోదయ్యాయి. రెండు జిల్లాల్లో 144 సెక్షన్ విధించారు. సెపాహిజాలా, ఖోవై, ఉనకోటి, పశ్చిమ త్రిపుర జిల్లాల్లో ప‌లు రాజకీయ గ్రూపుల మధ్య చిన్నపాటి వాగ్వాదానికి సంబంధించిన కొన్ని చెదురుమదురు సంఘటనలు కూడా నమోదయ్యాయని పోలీసులు తెలిపారు.   

50 violence incidents reported in Tripura: త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువ‌డిన త‌ర్వాత రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి. రాజధాని అగర్తలా నగర శివారు ప్రాంతాలతో సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చెదురుమదురు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయ‌ని పోలీసులు తెలిపారు. ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన త‌ర్వాత‌ రాష్ట్రంలో 50  ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు నమోదయ్యాయి. రెండు జిల్లాల్లో 144 సెక్షన్ విధించారు. సెపాహిజాలా, ఖోవై, ఉనకోటి, పశ్చిమ త్రిపుర జిల్లాల్లో ప‌లు రాజకీయ గ్రూపుల మధ్య చిన్నపాటి వాగ్వాదానికి సంబంధించిన కొన్ని చెదురుమదురు సంఘటనలు కూడా నమోదయ్యాయని పోలీసులు వెల్ల‌డించారు. ఫిర్యాదుల మేరకు ఇప్పటి వరకు నాలుగు కేసులు నమోదు చేశారు. ఈ ఘటనలకు సంబంధించి 22 మందిని అదుపులోకి తీసుకున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేశామనీ, అన్ని రాజకీయ పార్టీలతో శాంతి సమావేశాలు నిర్వహించామని తెలిపారు.

అయితే, గురువారం సాయంత్రం వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కనీసం 50 హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోగా, ఆ తర్వాత మరిన్ని జరిగాయని పేరు వెల్లడించడానికి ఇష్టపడని మరో అధికారి తెలిపారు. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారనీ, చికిత్స నిమిత్తం అగర్తలాకు తరలించామని తెలిపారు. ఈ సంఘటనల్లో బీజేపీ మద్దతుదారులు, ప్రతిపక్ష లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్ మద్దతుదారులు, తొలి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి 13 స్థానాలు గెలుచుకున్న టిప్రా మోథా పార్టీ మద్దతుదారులు ఉన్నార‌నీ, వారిలో ప‌లువురు గాయపడ్డార‌ని తెలిపారు. ఈ  హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌ను అరికట్టే చర్యల్లో భాగంగా పశ్చిమ త్రిపుర జిల్లా యంత్రాంగం ప్రభావిత ప్రాంతాల్లో శాంతిభద్రతలను కాపాడేందుకు సీఆర్పీసీ సెక్షన్ 144 కింద ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించింది.

పశ్చిమ త్రిపుర జిల్లా మేజిస్ట్రేట్ దేబప్రియ బర్దన్ జారీ చేసిన ఉత్తర్వుల్లో... ''పశ్చిమ త్రిపుర జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సంఘ విద్రోహ, క్రిమినల్ శక్తులు చట్టవిరుద్ధంగా గుమికూడడం, శాంతి, ప్రజాశాంతికి భంగం కలిగించే అవకాశం ఉంది. ఇది జిల్లాలో శాంతియుత వాతావరణానికి విఘాతం కలిగిస్తుందని భావిస్తున్నారు. ప్రజాశాంతికి భంగం కలగకుండా తక్షణమే నిషేధాజ్ఞలు జారీ చేయాల్సిన అవసరం ఉందని, లేనిపక్షంలో శాంతిభద్రతలు క్షీణించే ప్రమాదం ఉందని" పేర్కొన్నారు. కర్రలు, రాడ్లు, వెదురు, రాళ్లు వంటి ఆయుధాలతో ప‌ట్టుకోవ‌డ‌ం, ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడడాన్ని నిషేధిస్తూ, అవసరమైన అనుమతులు లేకుండా రెండు లేదా అంతకంటే ఎక్కువ మోటారు సైకిళ్లు లేదా కార్ల కదలికలను నిషేధించడం జరుగుతోంది. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని" పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను ఎవరైనా ఉల్లంఘిస్తే ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చ‌రించారు. 

హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న ధలై జిల్లాలో కౌంటింగ్ సమయం నుంచే ఇలాంటి ఆదేశాలు విధించారు. మార్చి 2న ఎస్డీఎం కార్యాలయం లాంగ్ట్రాయ్ వ్యాలీలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సందర్భంగా బీజేపీ, టిప్రా మోతా మద్దతుదారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుందని ధలై పోలీసులు తెలిపారు. అల్లరిమూకలు హింసాత్మకంగా మారి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నార‌నీ,  పోలీసులు, ఇతర భద్రతా బలగాలు సకాలంలో జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందన్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

ఇండియాలో ఏ ఆవు ఎక్కువ పాలు ఇస్తుంది..? రోజుకు ఎన్ని లీటర్లో తెలుసా?
Narendra Modi Plays Football with Youth in Gangtok Visit | Foot Ball Playing | Asianet News Telugu