కరోనా టెస్టుల భయం: సిల్చార్ ఎయిర్‌పోర్టు నుండి 300 మంది ప్రయాణీకులు జంప్

By narsimha lodeFirst Published Apr 22, 2021, 4:48 PM IST
Highlights

కరోనా టెస్టుల భయంతో అసోం రాష్ట్రంలోని ఎయిర్ పోర్టు నుండి 300 మంది ప్రయాణీకులు పారిపోయారు.  వీరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

గౌహతి: కరోనా టెస్టుల భయంతో అసోం రాష్ట్రంలోని ఎయిర్ పోర్టు నుండి 300 మంది ప్రయాణీకులు పారిపోయారు.  వీరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.కరోనా కట్టడిలో భాగంగా  ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన ప్రయాణీకులకు కరోనా టెస్టులు చేయడం తప్పనిసరి చేస్తూ అసోం ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ఎయిర్ పోర్టుల్లో పరీక్షల కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసింది. అసోంలోని సిల్చార్ ఎయిర్ పోర్టులో కరోనా పరీక్షలు చేయించుకోవాలని  ప్రయాణీకులను సిబ్బంది అడిగారు.

అయితే ఎయిర్ పోర్టులో  కరోనా పరీక్ష ఫీజు రూ. 500 నిర్ణయించడంపై  ప్రయాణీకులు అభ్యంతరం తెలిపారు. ఈ విషయమై  ప్రయాణీకులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.  ఇదే సమయంలో సుమారు 300 మంది ప్రయాణీకులు  ఎయిర్ పోర్టు నుండి పరీక్షలు చేయించుకోకుండానే వెళ్లిపోయారు.

బుధవారం నాడు ఈ విమానాశ్రయానికి 690 మంది ప్రయాణీకులు వచ్చారు. వీరిలో 300 మందికి పైగా పరీక్షలు చేయించుకోకుండా వెళ్లిపోయారని  అధికారులు ప్రకటించారు. ఈ విషయమై విచారణకు ఆదేశించినట్టుగా అధికారులు తెలిపారు.  పరీక్షలు చేయించుకోకుండా వెళ్లిపోయినవారిపై  క్రిమినల్ చర్యలు తీసుకొంటామని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చినవారంతా ఏడు రోజుల పాటు క్యారంటైన్ లో ఉండాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. 


 

click me!