
తను కష్టపడి చదివి సంపాదించుకున్న సర్టిఫికెట్స్.. అనుకోకుండా వచ్చిన వరదల్లో తడిచి చిరిగిపోవడాన్ని ఆ యువకుడు తట్టుకోలేకపోయాడు. సర్టిఫికెట్స్ లేకపోతే తనకు భవిష్యత్తు లేదని బాధపడుతూ.. ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...
కోజికోడ్కు చెందిన కైలాష్ (19) ప్లస్ టూ పూర్తి చేశాడు. ఐటీఐలో చేరడం కోసం సిద్ధమవుతున్నాడు. కానీ అనుకోకుండా వచ్చిన భారీ వర్షాల కారణంగా ఇంట్లోకి వరద నీరు వచ్చి చేరింది. ఇంట్లోని సామాన్లన్నీ తడిసి ముద్దయ్యాయి. దాచిపెట్టిన సర్టిఫికెట్లు కూడా పాడయ్యాయి. పునరావాస కేంద్రం నుంచి వెనక్కి వచ్చాక.. ఇంటిని శుభ్రం చేస్తుండగా.. సర్టిఫికెట్లు పాడైనట్లు గుర్తించారు.
సర్టిఫికెట్లు తడిచి చిరిగిపోవడంతో కైలాష్ ఆవేదనకు గురయ్యాడు. ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అది చూసి అతని తల్లిదండ్రులు గెండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఈ వరదల కారణంగా తాను తన కుమారుడిని కోల్పోయానంటూ.. అతని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.