రైలు నుంచి 167మంది వలస కార్మికులు మిస్సింగ్

By telugu news teamFirst Published May 15, 2020, 7:26 AM IST
Highlights

గుజరాత్‌లోని సూరత్ నుంచి వలస కార్మికులను ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు తరలించారు. అయితే అలా తరలించిన రైళ్లో 167 మంది వలస కార్మికులు అదృశ్యమయ్యారు. 
 

దేశంలో కరోనా వైరస్ రోజు రోజుకీ విజృంభిస్తోంది.ఈ నేపథ్యంలో దేశంలో లాక్ డౌన్  విధించారు. అయితే ఈ లాక్ డౌన్ కారణంగా వలస కార్మికులు పడినన్ని బాధలు మరెవరూ పడేలేదేమో. ఉన్న చోట పని లేదు.. తినటానికి తిండి లేదు.. సొంత రాష్ట్రానికి వెళ్లే దారి లేక చాలా ఇబ్బంది పడ్డారు. పలువురు కాలి నడకన ఇంటికి చేరుందుకు యత్నించి ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు.

కాగా.. వారి కష్టాలు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వారిని వారి స్వస్థలాలకు పంపేందుకు రైళ్లు ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా గుజరాత్‌లోని సూరత్ నుంచి వలస కార్మికులను ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు తరలించారు. అయితే అలా తరలించిన రైళ్లో 167 మంది వలస కార్మికులు అదృశ్యమయ్యారు. 

అధికారుల వివరాల ప్రకారం 1,340 మంది వలస కార్మికులతో మే 12న సూరత్ నుంచి ప్రత్యేక రైలు రాగా.. హరిద్వార్‌కు చేరుకునే సమయానికి అందులో 1,173 మంది మాత్రమే ఉన్నారు. దీంతో అధికారుల్లో టెన్షన్ మొదలైంది. కనిపించకుండా పోయిన వలస కార్మికులు రైలు బయలుదేరినప్పుడు అందులోనే ఉన్నారా..? లేక మధ్యలో ఎక్కడైనా దిగి వెళ్లారా..? అన్న కోణాల్లో విచారణ చేపడుతున్నారు.

click me!