
బెంగళూరు: కర్ణాటకలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బీజేపీకి గట్టి మద్దతుదారుడైన జగదీశ గౌడ తన కాఫీ తోటలో పని చేసే 16 మందిని నిర్బంధించాడు. వారందరినీ వేధించాడు.కొన్ని రోజులపాటు ఆ దళితులను జగదీశ గౌడ వేధిస్తున్నారు. కర్ణాటకలోని చిక్కమగలూరు జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తమను రోజుల తరబడి వేధించారని బాధితులు చెప్పారు. అందులో ఒకరు గర్భిణీ ఉన్నారని, దాడి కారణంగా ఆమెకు గర్భస్రావం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గర్భస్రావమైన మహిళ ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. జగదీశ గౌడ, ఆయన కొడుకు తిలక్ గౌడలపై కేసు రిజిస్టర్ అయింది. వారిద్దరు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారిని గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు.
జేనుగద్దెలో కాఫీ తోటలో ఈ బాధితులు రోజు కూలీలుగా చేసేవారు. యజమాని నుంచి వారు సుమారు రూ. 9 లక్షలు అప్పు తీసుకున్నారు. వారు తిరిగి చెల్లించలేకపోవడంతో వారందరినీ నిర్బంధించినట్టు పోలీసులు తెలిపారు.
‘అక్టోబర్ 8వ తేదీన కొందరు బలెహన్నూర్ పోలీసు స్టేషన్ కు వచ్చారు. జగదీశ్ గౌడ తమ బంధువులను వేధిస్తున్నాడని ఆరోపించారు. కానీ, ఆ తర్వాత వారు ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు’ అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
Also Read: దొంగతనం చేశాడనే ఆరోపణలతో దళిత బాలుడిని పోల్కు కట్టి కొట్టారు.. కేసు నమోదు
తర్వాతి రోజు గర్భిణి జిల్లా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అప్పుడు చిక్కమగలూరులో కొత్త ఫిర్యాదు వచ్చిందని వివరించారు. ఎస్పీ నుంచి సూచనలు వచ్చాక ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలిపారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి స్పాట్కు వెళ్లారు. అక్కడ 8 నుంచి 10 మందిని ఓ గదిలో నిర్బంధించినట్టు పోలీసులు చూశారు. యజమానితో మాట్లాడిన తర్వాత వారిని విడుదల చేశారు.
‘సుమారు 15 రోజులు వారిని హౌజ్ అరెస్టు చేశారు. అందులో నాలుగు కుటుంబాలకు చెందిన 16 మంది ఉనన్ారు. వారంతా ఎస్సీ కమ్యూనిటీకి చెందినవారు. పిర్యాదు ప్రకారం వారంతా నిర్బంధంలో ఉన్నారు’ అని తెలిపారు.
జగదీశ గౌడ్ నుంచి వర్కర్లు అప్పు తీసుకున్నారని, అందులో కొందరు ఇల్లు వదిలి వెళ్లిపోయారని ఎస్పీ ఉమా ప్రశాంత్ తెలిపారు. కాబట్టి, మిగతా వారందరినీ జగదీశ గదిలో లాక్ చేసి పెట్టాడని వివరించారు.