శవాలను ఎత్తుకుపోయే పోలీసులున్నారు: కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్

By telugu teamFirst Published Nov 2, 2019, 12:42 PM IST
Highlights

ఆర్టీసీ డ్రైవర్ బాబు అంత్యక్రియల సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై బిజెపి ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. తాము కేంద్రంలో అధికారంలో ఉన్నామని కేసీఆర్ ను ఆయన హెచ్చరించారు.

కరీంనగర్: శుక్రవారం కరీంనగర్ లో జరిగిన ఘటనపై బిజెపి లోకసభ సభ్యుడదు బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. ఆర్టీసి డ్రైవర్ బాబు  అంత్యక్రియలను సీఎం కేసీఆర్, సీఎంఓ ఆదేశాల ప్రకారం పోలీసులు చేయించారని ఆయన ఆరోపించారు. ఆర్టీసీ డ్రైవర్ బాబు అంత్యక్రియల సమయంలో కనీసం కుటుంబ సభ్యుల  చివరి కోరిక కూడ ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. 

ఆర్టీసీ డ్రైవర్ బాబు మృతదేహం ఉన్న ఫ్రీజర్ పనిచేయకుండా అరెపల్లి గ్రామమలో కరెంటు కూడా తెసేశారని బండి సంజయ్ శనివారం మీడియా సమావేశంలో ఆరోపించారు. బాబు అంత్యక్రియలో సివిల్ డ్రెస్ లో ఉన్న పోలీసులు శాంతియుతంగా చేస్తున్న ర్యాలీని భయానకంగా చేశారని అన్నారు. తెలంగాణలో పోలీసులు ఉద్యమ కారులపై దాడి చేసి ప్రభుత్వానికి గులాంగిరి చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. 

Also Read: డ్రైవర్ బాబు అంతిమయాత్ర: బీజేపీ ఎంపీ సంజయ్‌పై చేయిచేసుకున్న ఏసీపీ, ఉద్రిక్తత

నిజాయితీగా పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు లూప్ లైన్లో ఉన్నారని ఆయన అన్నారు. ఎంపీపై దాడి జరిగితే డీజీపీ,హోం మంత్రి  ఎం చేస్తున్నారని నిలదీశారు. శవాన్ని ఎత్తుకొని పోయే పోలీసులు  తెలంగాణలో ఉన్నారని అన్నారు. ఆర్టీసీ సమ్మెను విచ్ఛిన్నం చేసి ఆర్టీసీ కార్మికుల్లో భయం కల్పించేందుకు పోలీసులతో దాడి చేస్తారా అని అడిగారు. తాము చట్టాన్ని వ్యతిరేకించబోమని, చట్టానికి లోబడి పనిచేస్తామని అన్నారు. సీఎం కేసీఆర్ పతనం కరీంనగర్ నుండే మొదలవుతుందని అన్నారు.

Also Read: Karimnagar Bandh video: పోలీస్ లాఠీచార్జీ... ఏబీవీపీ నాయకుడికి తీవ్ర గాయాలు

 రాష్ట్రంలో నువ్వు అధికారంలో ఉంటే కేంద్రంలో మేము అధికారంలో ఉన్నామని, ఈ విషయం గుర్తుంచుకో అని ఆయన కేసీఆర్ ను ఉద్దేశించి అన్నారు. ఆర్టీసీ కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారనే ప్రకటనను  వెనక్కి తీసుకొని కార్మికులకు క్షమాపణ చెప్పాలని ఆయన కేసీఆర్ ను డిమాండ్ చేశారు. 

ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని అన్నారు. ఆర్టీసీ కార్మికులకు తాము హ్యాట్సాఫ్ చెబుతున్నామని అన్నారు. కార్మికులకు బీజేపీ అండగా ఉంటుందని అన్నారు. ఆర్టీసి కార్మికులకు జీతాలు వచ్చే వరకు వారి పిల్లలకు విద్యాసంస్థలు ఫీజులు మాఫీ చేయాలని ఆయన కోరారు. వీలుకాకపోతే జీతాలు వచ్చేవరకు కొంత సమయం ఇవ్వాలని సూచించారు. బాబు అంతిమ యాత్రలో పోలీసులు పథకం ప్రకారం సివిల్ డ్రెస్సులో హింసకు పాల్పడ్డారని ఆరోపించారు.

click me!