కరీంనగర్ జిల్లాలో ఇక కేసీఆర్ వాగు...25ఏళ్ల కల....: మంత్రి గంగుల ప్రకటన

By Arun Kumar PFirst Published Feb 21, 2020, 7:05 PM IST
Highlights

కరీంనగర్ జిల్లాకి కాళేశ్వరం నీటిని తీసుకువచ్చిన ముఖ్యమంత్రికి మంత్రి గంగుల కమలాకర్ అరుదైన గౌరవాన్ని అందించారు. 

కరీంనగర్: సీఎం కేసీఆర్ దృడసంకల్పంతో కాళేశ్వరం ప్రాజెక్టును పరుగులెత్తిస్తున్నారని... ఈ  నీటితో రాష్ట్రంమొత్తం సస్యశ్యామలం కానుందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కాళేశ్వరం నీటితో జిల్లాలోని ఇరుకుల్ల వాగు నిండుకుండలా మారిందని... అందువల్ల దీనికి కేసీఆర్ వాగుగా నామకరణం చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. 25 ఏళ్ళుగా నీళ్లు చూడని గ్రామాలు ఇప్పుడు నీళ్లతో వాగు కలకలడటంతో సంతోషంగా వ్యక్తం చేస్తున్నారన్నారు.

రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పక్షానే రైతులు మరోసారి నిలిచారని మంత్రి గంగుల అన్నారు. శుక్రవారం దుర్షెడ్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయంలో సంఘం ఛైర్మన్‌  బల్మూరి ఆనందరావు తో మంత్రి ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే గెలుపొందిన డైరెక్టర్లను అభినందించారు. ఈ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన మంత్రికి గజమాల వేసి సత్కరించారు.

అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ... రైతుబంధు, రైతు బీమా, సకాలంలో విత్తనాలు, ఎరువులు, 24గంటలపాటు ఉచితంగా నాణ్య మైన విద్యుత్‌ అందిస్తున్న ప్రభుత్వానికి రైతులు సహకార ఎన్నికల్లో వెన్నుదన్నుగా నిలిచారని అన్నారు. మిమ్మల్ని గెలిపించిన రైతుల నమ్మకాన్ని వమ్ము చేయొద్దని పాలక వర్గానికి సూచించారు.

read more  హైదరాబాద్ టు వేములవాడ హెలికాప్టర్ సర్వీస్ లు...

రైతుల దెబ్బకు ప్రతిపక్ష కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు బేజారైపోయాయని అన్నారు. ఒక్క సంఘంలోనూ కనీస ప్రభావం చూపలేక పోయాయని అన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా ముఖ్యమంత్రి కేసీఆర్ పనితీరును నమ్మి ప్రజలు ఓట్లు వేశారని... వారు కోరుకునేలా పరిపాలన చేస్తూ రుణం తీర్చుకుంటామని  అన్నారు. 

బీడు భూములకు కాళేశ్వరం నీళ్లు చేరడంతో పూర్తి స్థాయిలో సాగులోకి వచ్చిందన్నారు. ఎస్సారెస్పీ ప్రధాన కాల్వలో సీఆర్‌ నిర్మాణంతో డి-89 కాల్వ చివరి భూములకు సాగునీరు చేరుతుందన్నారు. రబీలో పెద్ద ఎత్తున ధాన్యం దిగుబడి వస్తుందన్నారు. సహకార సంఘాల సభ్యులు రైతులతో కలిసి సమస్యలు లేకుండా గ్రామాల వారీగా ధాన్యం కొనుగోళ్లపై ప్రణాళికతో ముందు సాగాలన్నారు. ధాన్యం దిగుబడి ఎంత వస్తుందనే అంచనాలతో సిద్ధంగా ఉండాలని సూచించారు. 

ఖరీఫ్‌లో పకడ్బందీగా ధాన్యం కొన్నామని, ఇప్పుడు కూడా ఎంత ధాన్యం వచ్చినా కొనుగోలు చేస్తామన్నారు. ఏ గ్రామం రైతులు ఆ గ్రామంలోనే విక్రయించేలా ఆన్‌లైన్‌ ట్యాగ్‌ ద్వారా చర్యలు తీసుకుంటామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని అరికట్టాలని కోరారు. రైతుల సమస్యలను పరిష్కరిస్తూ పాలకవర్గ సభ్యులు అన్నదాతల నమ్మకాన్ని నిలబెట్టాలన్నారు. సంఘం పక్షాన రైతులకు అన్ని విధాల సేవలు అందించాలని మంత్రి సూచించారు. 

read more  సిద్దిపేట ఎమ్మెల్యేగానే కేసీఆర్ రికార్డు... కేవలం గంటలోనే...: కేటీఆర్

ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షుడు  గొనె నర్సయ్య, కరీంనగర్ సొసైటీ అధ్యక్షుడు శ్యామ్ సుందర్ రెడ్డి, కరీంనగర్‌ గ్రామీణ ఎంపీపీ టి.లక్ష్మయ్య, జెడ్పిటిసి పురమల్ల లలిత,  వైస్‌ ఎంపీపీలు నారాయణ,  మేయర్ సునిల్ రావు ,మాజీ సొసైటీ చైర్మన్ మంద రాజమల్లు , ఉపసర్పంచ్ సుంకిశాల సంపత్ రావు, నాయకులు చల్ల హరిశంకర్‌,  సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.
 

click me!