కరోనా సత్తా ఏంటో జనానికి తెలియట్లేదు.. ఉగ్రరూపాన్ని చూస్తారు: డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరికలు

By Siva KodatiFirst Published Apr 21, 2020, 4:43 PM IST
Highlights

ప్రపంచదేశాల్లో విలయ తాండవం చేస్తున్న కరోనా మహమ్మారికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సంచలన ప్రకటన చేసింది. కోవిడ్ 19 ప్రతాపం భవిష్యత్‌పై మరింత తీవ్రంగా ఉంటుందని తెలిపింది.

ప్రపంచదేశాల్లో విలయ తాండవం చేస్తున్న కరోనా మహమ్మారికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సంచలన ప్రకటన చేసింది. కోవిడ్ 19 ప్రతాపం భవిష్యత్‌పై మరింత తీవ్రంగా ఉంటుందని తెలిపింది.

డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథానమ్ గేబ్రియసస్ మంగళవారం మాట్లాడుతూ... కరోనా ప్రభావం మానవాళిపై చాలా తీవ్రంగా ఉంటుందని అన్నారు. వైరస్ తీవ్రతలో కేవలం కొద్దిశాతం మాత్రమే మనం చూశామని.. దీని ప్రభావం భవిష్యత్తులో మరింత స్పష్టంగా కనిపిస్తుందని హెచ్చరించారు.

Also Read:ప్రపంచ వ్యాప్తంగా.. 2లక్షల మరణాలకు చేరువలో కరోనా మృతులు

కోవిడ్ 19 తీవ్రత ఏంటో చాలా మంది ప్రజలకు ఇంకా అర్థం కావట్లేదని.. 1918లో వచ్చిన స్పానిష్ ఫ్లూ కంటే కరోనా ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

అదే గనుక జరిగితే ముందుముందు చాలా దారుణమైన పరిస్ధితులను ఎదుర్కొక తప్పదని కరోనాను కట్టడి చేయకపోతే వైరస్ ఉగ్రరూపాన్ని చూస్తారని టెట్రోస్ హెచ్చరించారు.

అసలే కరోనాను ఎలా కట్టడి చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్న దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన హెచ్చరికలు మరింత భయాందోళనకు గురిచేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 25 లక్షలకు చేరుకోగా, సుమారు లక్షా 65 వేలమంది ప్రాణాలు కోల్పోయారు.

Also Read:విదేశీయులకు నో ఎంట్రీ: డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం

మరోవైపు కరోనా వైరస్ పుట్టుకకు సంబంధించిన అంశంపై ఒక అమెరికన్ బృందాన్ని అనుమతించాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన డిమాండ్‌ను చైనా సోమవారం తీవ్రంగా తిరస్కరించింది. తాము కోవిడ్ 19 బాధితులమేనని, నేరస్థులం కాదని చైనా స్పష్టం చేసింది. 

click me!