
యూరోపియన్ యూనియన్ (european union) పార్లమెంట్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ (volodymyr zelensky) ప్రసంగించారు. ఈ సందర్భంగా ఈయూ దేశాలు స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడం విశేషం. జెలెన్ స్కీ మాట్లాడుతూ.. రష్యాకు లొంగిపోయే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. మా సత్తా ఏంటో నిరూపించుకుంటామని.. ఈ పోరాటంలో విజయం సాధిస్తామని జెలెన్ స్కీ ధీమా వ్యక్తం చేశారు. రష్యా సేనలతో తమ పౌరులు ధైర్యంగా పోరాడుతున్నారని.. ఈ పోరాటంలో ఎంతవరకైనా వెళ్తామని జెలెన్ స్కీ పేర్కొన్నారు.
రష్యా బాంబు దాడుల్లో 16 మంది చిన్నారులు చనిపోయారని.. అసలు పుతిన్ లక్ష్యమేంటీ అని ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రశ్నించారు. ఈయూ దేశాలు మద్ధతిస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు ఉక్రెయిన్కు ఈయూలో సభ్యత్వ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు ఉక్రెయిన్ దరఖాస్తును యూరోపియన్ యూనియన్ ఆమోదించింది. స్పెషల్ అడ్మిషన్ కేటగిరీలో ఉక్రెయిన్కు ఈయూలో సభ్యత్వం ఇచ్చేందుకు సభ్య దేశాలు అంగీకరించినట్లుగా తెలుస్తోంది.
మరోవైపు.. ఖార్కివ్ నగరం (kharkiv) బాంబుల మోతతో దద్దరిల్లుతోంది. రష్యా సేనలు (russian army) మిస్సెల్స్తో విరుచుకుపడుతున్నాయి. జనావాసాలను సైతం టార్గెట్ చేస్తున్నారు రష్యా సైనికులు. ఉదయం నుంచి క్షిపణుల దాడులు కొనసాగుతున్నాయి. ఈ ఘటనల్లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టాలు జరిగినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు 20 మందికి పైగా చనిపోయినట్లు మేయర్ ప్రకటించారు. ఖర్కీవ్ దగ్గర రష్యా దాడులు.. విద్యార్ధుల తరలింపునకు అడ్డంకిగా మారింది. ఈ క్రమంలో విద్యార్ధుల తరలింపునకు సురక్షిత మార్గం కల్పించాలని రష్యా, ఉక్రెయిన్లను కోరింది కేంద్ర విదేశాంగ శాఖ .
Kharkivలోని ఒక అడ్మినిస్ట్రేటివ్ భవనంపై జరిగిన దాడికి సంబంధించిన వీడియోను ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ట్విట్టర్లో షేర్ చేసింది. రష్యన్ క్షిపణి భవనాన్ని తాకడంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం కనిపిస్తుంది. ఆ సమయంలో రోడ్డుపై పెద్ద సంఖ్యలో వాహనాలు ఉండటం కూడా ఈ వీడియోలో చూడొచ్చు.
రష్యా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ పౌరులను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపిస్తూ ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ ట్వీట్ చేసింది, "అంతర్జాతీయ మానవతా చట్టాలను ఉల్లంఘిస్తూ రష్యా యుద్ధం చేస్తోంది. పౌరులను చంపుతుంది. పౌర మౌలిక సదుపాయాలను నాశనం చేస్తుంది. ఇప్పుడు క్షిపణుల ద్వారా పెద్ద నగరాలపై కాల్పులు జరపడమే రష్యా ప్రధాన లక్ష్యం’ అని ట్వీట్లో పేర్కొంది.
ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి Dmytro Kuleba కూడా క్షిపణి దాడి దృశ్యాలను ట్వీట్ చేశారు. ‘ఖార్కివ్లోని సెంట్రల్ ఫ్రీడమ్ స్క్వేర్, రెసిడెన్షియల్ డిస్ట్రిక్ట్లపై అనాగరికంగా రష్యన్ క్షిపణి దాడులు చేసింది. పుతిన్ ఉక్రెయిన్ను విచ్ఛిన్నం చేయలేకపోయాడు. అతను కోపంతో మరిన్ని యుద్ధ నేరాలకు పాల్పడుతున్నాడు. అమాయక పౌరులను హత్య చేస్తున్నాడు. ప్రపంచం మరింతగా ఒత్తిడిని పెంచి.. రష్యాను ఒంటరిగా చేయండి’ అని పేర్కొన్నారు.