కరోనా విలయతాండవం.. అమెరికాలో ఒక్కరోజే 2వేల మంది బలి

By telugu news teamFirst Published Apr 11, 2020, 8:20 AM IST
Highlights

ఈ చావుల్లో కూడా అమెరికా ఇప్పుడు రికార్డు సాధించడం గమనార్హం. మొన్నటి వరకు ఇటలీ, స్పెయిన్ వంటి దేశాల్లో మొదటి రెండు స్థానాల్లో ఉండగా.. ఇప్పుడు అమెరికా మొదటి స్థానానికి చేరుకుంది.
 

అగ్రరాజ్యం అమెరికా లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకీ అక్కడ ఈ వైరస్ విధ్వంసం సృష్టిస్తోంది. కేవ‌లం 24 గంటల వ్య‌వ‌ధిలోనే ఏకంగా 2 వేల మంది మృతి చెందడంతో భ‌యాన‌క ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయి. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు అమెరికాలో మొత్తం 496,535 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్థారించారు. కాగా..  ఇప్పటి వరకు 18,586 మంది ప్రాణాలు కోల్పోయారు.

Also Read కరోనా : చికాగో జైలు నుండి ఖైదీలను మరో జైలుకు తరలింపును తిరస్కరించిన జడ్జి...

ఇదిలా ఉండగా.. కేవలం 24గంటల్లో 35,098 కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం. కాగా... వీటి సంఖ్య చూస్తుంటే.. అగ్ర రాజ్యం ఎంతటి భయానక పరిస్థితుల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా... ఈ చావుల్లో కూడా అమెరికా ఇప్పుడు రికార్డు సాధించడం గమనార్హం. మొన్నటి వరకు ఇటలీ, స్పెయిన్ వంటి దేశాల్లో మొదటి రెండు స్థానాల్లో ఉండగా.. ఇప్పుడు అమెరికా మొదటి స్థానానికి చేరుకుంది.

ఇటలీలో కన్నా ఎక్కువ మరణాలు ఇప్పుడు అమెరికాలో చోటుచేసుకున్నాయి. ఈ మరణాలతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా లక్ష మరణాలు దాటడం గమనార్హం. కాగా.. ప్రపంచ వ్యాప్తంగా గురువారం ఒక్క రోజే 7,300 మంది ప్రాణాలు కోల్పోయారు.  

గడిచిన వారం రోజుల్లో మరణాల శాతం 6 నుంచి 10 శాతానికి పెరిగిందని నిపుణులు చెబుతున్నారు.ఈ వైరస్ కారణంగా తొలి మరణం జనవరి 9వ తేదీన వుహాన్ లో చోటుచేసుకోగా.. కేవలం 83 రోజులు గడిచే సరికి 50వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. గడిచిన 8 రోజుల్లో ఈ మరణాల సంఖ్య లక్షకు చేరుకోవడం శోచనీయం.

ఇదిలా ఉండగా.. అమెరికాలో 

ఇప్ప‌టివ‌ర‌కు మృతి చెందిన వారిలో 11 మంది భారతీయులు కూడా ఉన్నారు. వీరిలో 10 మంది పురుషులే. వీరంతా న్యూయార్క్, న్యూజెర్సీకి చెందిన వారు. న్యూయార్క్‌లో మరణించిన భారతీయుల్లో నలుగురు ట్యాక్సీ డ్రైవర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్లోరిడాలో మరొక ఇండియన్‌ చనిపోయినట్టు అధికారులు వెల్లడించారు. 

ఇక మరో 16 మంది భారతీయులకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు పరీక్షల్లో తేలింది. వీరిలో నలుగురు మహిళలు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. న్యూయార్క్, న్యూజెర్సీ, టెక్సాస్, కాలిఫోర్నియాలో ఈ కేసులు నమోదయ్యాయి. కరోనా వ్యాధిగ్రస్తులు భారత్‌లోని ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకకు చెందినవారు. 

అమెరికాలో భారత రాయబార కార్యాలయం, స్థానిక అధికారులు, వివిధ ఎన్నారై సంస్థలతో కలిసి కరోనా సోకిన భారతీయులకు కావల్సిన సాయాన్ని అందిస్తున్నారు.  వీరి ప‌రిస్థితి ఎలా ఉంటుందోన‌ని కుటుంబ స‌భ్యులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

click me!