
Putin Orders Temporary Ceasefire in Ukraine: రెండవ ప్రపంచ యుద్ధంలో సోవియట్ యూనియన్ నాజీ జర్మనీపై సాధించిన విజయానికి 80వ వార్షికోత్సవం సందర్భంగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక సంచలన నిర్ణయం తీసుకున్నారు. మే 8 నుంచి మే 10 వరకు ఉక్రెయిన్లో తాత్కాలిక కాల్పుల విరమణకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ నిర్ణయం క్రెమ్లిన్ "మానవతా దృక్పథంతో" తీసుకున్నదిగా పేర్కొంది. ప్రకటనలో ఈ విరమణ మే 8 అర్ధరాత్రి ప్రారంభమై మే 11 అర్ధరాత్రి వరకు కొనసాగుతుందని వెల్లడించింది.
అయితే, పుతిన్ తాజా నిర్ణయం అనూహ్యమైనదిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇది కొనసాగుతున్న యుద్ధ పరిస్థితి, నిలిచిపోయిన శాంతి చర్చల మధ్య ఇలాంటి నిర్ణయం అందరిని ఆలోచనలో పడేసింది. క్రెమ్లిన్ తన ప్రకటనలో ఉక్రెయిన్ కూడా కాల్పుల విరమణ పాటించాలన్న ఆశాభావం వ్యక్తం చేసింది. పుతిన్ నిర్ణయం ఉక్రెయిన్-రష్య మధ్య శాంతి చర్చలకు దారితీయవచ్చని కూడా భావిస్తున్నారు.
రష్యా షరతులు లేని వన్-ఆన్-వన్ చర్చలకు సిద్ధమని ప్రకటించినా, ఉక్రెయిన్ ఇప్పటివరకు స్పందించలేదు. ముఖ్యంగా రష్యా నాలుగు ఉక్రెయిన్ ప్రాంతాలను ఆక్రమించిన తర్వాత, కైవ్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ వ్యక్తిగతంగా పుతిన్ తో చర్చలు జరపాలనే విషయాన్ని నిరాకరించారు.
మే 8 నుండి ప్రారంభమయ్యే కాల్పుల విరమణ మూడు రోజులు.. ఇది పుతిన్ గతంలో ప్రకటించిన ఏకపక్ష కాల్పుల విరమణలతో పోలిస్తే భిన్నమైనదిగా కనిపిస్తోంది. ఉదాహరణకు, ఏప్రిల్ 2025లో ఈస్టర్ సందర్భంగా ప్రకటించిన విరమణ 30 గంటలకే పరిమితం చేశారు. రెండువైపులా జరిగిన ఉల్లంఘనల కారణంగా తీవ్ర సందేహాలు వ్యక్తమయ్యాయి.
ఈ నేపథ్యంలో, తాజా కాల్పుల విరమణ కూడా సమాన అనిశ్చితి కిందనే ఉంది. గత అనుభవాల ప్రకారం, ఇటువంటి చర్యలు మానవతా దృష్టితో తీసుకున్నవి కంటే అంతర్గత, బాహ్య ప్రెజ్ర్స్కి స్పందనగా లేదా ప్రజా సంబంధాల కోసం తీసుకున్న స్ట్రాటజీలు కావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇప్పటివరకు ఉక్రెయిన్ అధికారికంగా ఈ ప్రకటనపై స్పందించలేదు. జెలెన్స్కీ గతంలో తాత్కాలిక కాల్పుల విరమణ వంటి కొన్ని షరతులపై మాత్రమే చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల విరమణ వాస్తవికమైన శాంతి ప్రక్రియకు తెరలేపుతుందా, లేక ఇది ఒక వ్యూహాత్మక గేమ్ ప్లే మాత్రమేనా అన్నది రాబోయే రోజుల్లో చూడాలి.