
న్యూఢిల్లీ: భారత మూలాలు గల రిషి సునాక్ యూకే ప్రధానిగా గెలిచి చరిత్ర లిఖించారు. భారత సంతతి బ్రిటన్ ప్రధాని కావడం ఇదే తొట్టతొలిసారి. ఈ ఎన్నికలో గెలవడానికి 100 మంది ఎంపీల మద్దతు అవసరం. పోటీ నుంచి బోరిస్ జాన్సన్, పెన్నీ మోర్డాంట్ తప్పుకున్నారు. దీంతో రిషి సునాక్ తదుపరి ప్రధానిగా ఖరారైంది. ఆయన భారత సంతతి హిందువు. ఆయనకు మన దేశంతో ఉన్న కనెక్షన్ చూద్దాం.
రిషి సునాక్ యార్క్షైర్ నుంచి ఎంపీగా గెలిచారు. ఆయన పార్లమెంటులో భగవద్గీతపై ప్రమాణం చేసి తన ప్రమాణస్వీకారం చేశారు. ఇలా చేసిన తొలి యూకే పార్లమెంట్ సభ్యుడు. రిషి సునాక్ తల్లి తండ్రి పూర్వీకులు భారతీయులే. సునాక్ తల్లదండ్రులు ఫార్మాసిస్టులు. ఈస్ట్ ఆఫ్రికా నుంచి 1960లో యూకేకు వలస వెళ్లిపోయారు. సునాక్ తండ్రి యశ్వీర్ సునాక్ నేషనల్ హెల్త్ సర్వీస్ జనరల్ ప్రాక్టీషనర్. తల్లి ఉషా సునాక్ ఓ కెమిస్ట్ షాప్ నిర్వహించేవారు.
రిషి సునాక్ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ్ మూర్తి కూతురు అక్షత మూర్తీని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. పేర్లు క్రిష్ణ, అనౌష్క. బోరిస్ జాన్సన్ హయాంలో ఆర్థిక మంత్రిగా పని చేసినప్పుడు డౌనింగ్ స్ట్రీట్లో రిషి సునాక్ తన నివాసంలో దీపావళికి దీపాలు వెలిగంచేవారు.
Also Read: మోర్టాంట్ నామినేషన్ విత్డ్రా:బ్రిటన్ కొత్త ప్రధానిగా రిషి సునాక్
రిషి సునాక్ తరుచూ తమ వారసత్వ సంపద, కుటుంబం గురించి గుర్తు చేసుకుంటూ మాట్లాడుతుంటారు. విలువలు, సంస్కృతి గురించి చర్చిస్తారు.
ఆయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ చేశారు. ఆయన మాజీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్. రిషి సునాక్ తరుచూ సతీ, పిల్లల సమేతంగా బెంగళూరుకు వచ్చి పోతూ ఉంటారు. తన అత్తవారిని కలిసి వెళ్లుతుంటారు.
2022 వేసవిలో ప్రధాని పోస్టు కోసం క్యాంపెయిన్ చేసేటప్పుడు ఆయన విలాసవంతమైన నివాసం, ఖరీదైన సూట్లు, షూల గురించి తరుచూ విమర్శలు ఎదుర్కొనేవారు. ఆ సందర్భంలో తాను సంక్లిష్ట పరిస్థితులు, ఒత్తిళ్లలో ఉన్నప్పుడు భగవద్గీతనే కాపాడుతుందని అన్నారు.