
వియత్నాం రాజధాని హనోయ్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జువాన్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ లోని తొమ్మిది అంతస్తుల అపార్ట్ మెంట్ భవనంలో మంగళవారం అర్ధరాత్రి ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 50 మందికి పైగా మృతి చెందారు. అయితే ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు బుధవారం ఉదయం వరకు తెలియరాలేదు.
ఈ అగ్నిప్రమాదాన్ని అధికారులు ధృవీకరించారని వియత్నాంకు చెందిన ‘డాన్ ట్రి’ వార్తాపత్రిక బుధవారం ఉదయం తెలిపింది. అగ్నిప్రమాదంలో ఆసుపత్రిలో చేరిన 54 మందిలో చాలా మంది చనిపోయారని ఆ పత్రిక పేర్కొంది. రాత్రి 11:30 గంటలకు మంటలు ప్రారంభమయ్యాయని, ఆ సమయంలో చాలా మంది తమ ఫ్లాట్ లో ఉన్నారని పేర్కొంది.
కాగా.. ఈ అపార్ట్ మెంట్ ఇరుకైన సందులో ఉంది. దీంతో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది చాలా ప్రయాసలు పడాల్సి వచ్చింది. అగ్నిమాపక యంత్రాలు 300-400 మీటర్ల దూరంలోనే పార్క్ చేయాల్సి వచ్చింది. అక్కడి నుంచే సిబ్బంది పైపుల ద్వారా నీటిని తీసుకొచ్చి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అతి కష్టం మీద మంటలు అదుపులోకి వచ్చాయి.
గతేడాది దక్షిణ వియత్నాంలోని మూడు అంతస్తుల కరోకే బార్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 32 మంది మరణించారు. ఇది ఒక దశాబ్దంలో దేశంలో జరిగిన ఘోరమైన అగ్నిప్రమాదంగా మారింది. తాజాగా ప్రమాదంలో ప్రాణనష్టం మరింత ఎక్కువగా ఉంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు బయటకువ వచ్చాయి. అందులో అగ్నిపమాక సిబ్బంది నిచ్చెనల ద్వారా, పైపుల ద్వారా మంటలు చల్లార్చేందుకు ప్రయత్నించడం కనిపిస్తోంది. కాగా.. అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.