పాకిస్తాన్‌ మాజీ ప్రధానిపై ఉగ్రవాద అభియోగాలతో కేసు

By Mahesh KFirst Published Mar 19, 2023, 6:35 PM IST
Highlights

పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పై ఉగ్రవాద ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు. తోషిఖానా కేసులో విచారణ కోసం ఇస్లామాబాద్ కోర్టుకు ఇమ్రాన్ ఖాన్ హాజరవుతున్న సందర్భంలో పీటీఐ కార్యకర్తలు ఇందుకు వ్యతిరేకంగా భారీగా ఆందోళనలు చేపట్టారు. వారిని అదుపులో పెట్టే క్రమంలో ఆందోళనకారులకు , పోలీసులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఆందోళనకారుల విధ్వంసం కారణంగా పోలీసులు ఉగ్రవాద ఆరోపణలతో ఇమ్రాన్ ఖాన్ సహా సుమారు 17 మందిపై కేసు ఫైల్ చేశారు.
 

న్యూఢిల్లీ: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పై ఉగ్రవాద అభియోగాలతో కేసు నమోదైంది. పాకిస్తాన్ పోలీసులు ఆదివారం కేసు ఫైల్ చేశారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తోపాటు మరో డజను పీటీఐ నేతలపై కేసు నమోదైంది. జ్యుడీషియల్ కాంప్లెక్స్‌లో జరిగిన విధ్వంసం కారణంగా పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.

తోషఖానా కేసులో దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న విచారణకు ఇమ్రాన్ ఖాన్ హాజరు కావడానికి సిద్ధమయ్యారు. లాహోర్ నుంచి ఇస్లామాబాద్‌కు వచ్చారు. ఈ విచారణను అడ్డుకోవడానికి పీటీఐ నేతలు, కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆయన ఇస్లామాబాద్ జ్యుడీషియల్ కాంప్లెక్స్‌కు వెళ్లుతుండగా ఈ ఆందోళనలు తీవ్రంగా జరిగాయి. జ్యుడీషియల్ కాంప్లెక్స్‌ వద్దా భారీగా ఆందోళనలు చేపట్టారు. 

ఈ కేసు విచారణ సందర్భంగా పీటీఐ నేతలు, కార్యకర్తలను అదుపులో పెట్టడానికి పాకిస్తాన్ పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఆందోళనకారులను అదుపులో పెట్టడానికి పోలీసులు ప్రయత్నించగా చోటుచేసుకున్న ఘర్షణల్లో 25 మంది రక్షణ సిబ్బంది గాయపడ్డారు. దీంతో ఈ కేసు విచారణను అదనపు జిల్లా, సెషన్స్ జడ్జీ జాఫర్ ఇక్బాల్ మార్చి  30వ తేదీ వరకు వాయిదా వేశారు. 

Also Read: భారీగా బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్న బీఎస్ఎఫ్.. వాటి విలువ తెలిస్తే తిమ్మతిరగాల్సిందే..?

ఈ అల్లర్లు, విధ్వంసం చేసిన వారిపై పోలీసులు కేసు పెట్టారు. పీటీఐ వర్కర్లు, వాంటెడ్ నేతలపై ఇస్లామాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. సుమారు 17 మంది పీటీఐ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు జియో న్యూస్ రిపోర్ట్ చేసింది. ఈ విధ్వంసంపై పెట్టిన కేసులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సహా ఆయన పార్టీ పీటీఐ నేతలు, వర్కర్లపైనా ఉగ్రవాద అభియోగాలను పోలీసులు మోపారు.

click me!