
మహిళలపై వరస అత్యాచారాలకు పాల్పడిన వ్యక్తికి న్యాయస్థానం ఇచ్చిన తీర్పు సంచలనం రేపుతోంది. దక్షిణాఫ్రికా న్యాయస్థానం.. ఓ అత్యాచార నిందితుడికి వెయ్యేండ్ల జైలుశిక్ష విధించింది. 40ఇళ్లలో దొంగతనాలు చేయడంతో పాటు 41 మందికి పైగా మహిళలపై అత్యాచారాలకు పాల్పడినందుకు వెయ్యేండ్లకు పైగా జైలు శిక్ష విధించింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సెల్లో అబ్రమ్ మాపున్యా (33) అనే వ్యక్తి (2014-19) మధ్య ఇండ్లలో చొరబడి దొంగతనాలు చేసేవాడు. దొంగతనాలతో పాటు మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవాడు. పలువురు బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సెల్లో అబ్రమ్ మాపున్యాను అదుపులోకి తీసుకున్నారు.
ఆ తర్వాత నిందితుడిని కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసుకు సంబంధించి విచారణ జరిపిన కోర్టు.. నిందితుడు సెల్లో అబ్రమ్ మాపున్యాను దోషిగా తేల్చింది. సెల్లో అబ్రమ్ మొత్తం 40 ఇండ్లలో చోరీలకు పాల్పడటంతో పాటు 41 మంది మహిళలపైగా అత్యాచారం చేసినట్టు ధృవీకరించింది. ఈ క్రమంలోనే న్యాయస్థానం సెల్లో అబ్రమ్ మాపున్యాకు 1,088 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.