
శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు. కొంతకాలంగా శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక నిరసలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మహింద రాజపక్స ఎట్టకేలకు నేడు తన పదవికి రాజీనామా చేశారు. ఆర్థిక సంక్షోభం త్వరలోనే పరిష్కారం దొరుకుంతుందని రాజపక్స ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. హింసతో సాధించేంది శూన్యం అని పేర్కొన్నారు.
శ్రీలంక ఆరోగ్య శాఖ మంత్రి ప్రొఫెసర్ చన్నా జయసుమన కూడా తన పదవికి రాజీనామా చేశారు. గత కొంతకాలంగా శ్రీలంకలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసలు కొనసాగుతున్నాయి. రాజపక్స సోదరులు.. అధ్యక్షుడు గోటబయ రాజపక్స, ప్రధాన మంత్రి మహింద రాజపక్స తమ పదవులకు రాజీనామా చేయాలని విపక్షలు, నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. అయితే అందుకు రాజపక్స సోదరులు మాత్రం అందుకు నిరాకరిస్తూ వచ్చారు. అయితే తాజాగా నిరసనలకు తలొగ్గి మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు.
ఇక, శ్రీలంక ఆర్థిక సంక్షోభ పరిస్థితులు రోజురోజుకు మరింత దారుణంగా మారుతున్నాయి. ప్రజల నుంచి వ్యతిరేకత క్రమంగా పెరుగుతోంది. ఆర్థిక సంక్షోభంపై శ్రీలంకలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా నిరసనలు మరింతగా ఉధృతం అవుతున్నాయి. ఈ క్రమంలోనే శ్రీలంక పార్లమెంటును ముట్టడించేందుకు ప్రయత్నించిన విద్యార్థులు, ప్రజలపై పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్, జల ఫిరంగులను ప్రయోగించారు. ఇంటర్ యూనివర్శిటీ స్టూడెంట్స్ ఫెడరేషన్ నేతృత్వంలోని నిరసనకారులు శాసనసభకు దారితీసే ప్రధాన డ్రైవ్లో.. ఇనుప బారికేడ్లను తొలగిస్తున్న క్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన పోలీసులు చర్యలు తీసుకున్నారు.
దేశ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో విఫలమైన అధ్యక్షుడు గోటబయ రాజపక్స, ఆయన ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ట్రేడ్ యూనియన్ దేశవ్యాప్త సమ్మెకు దిగింది. అంతకు ముందు శ్రీలంక ప్రధాన ప్రతిపక్షం అధ్యక్షుడు గోటబయ రాజపక్సను తొలగించేందుకు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అలాగే, ఆయన సోదరుడు ప్రధాని మహింద రాజపక్స నేతృత్వంలోని ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస, యునైటెడ్ పీపుల్స్ ఫోర్స్ నాయకుడు స్పీకర్ మహింద యాపా అబేవర్ధనకు రెండు ప్రతిపాదనలు చేశారు. ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో ప్రధాని, మంత్రులు ఆర్థిక పరిస్థితికి సమిష్టి బాధ్యత వహించడంలో విఫలమయ్యారని ప్రతిపక్షాలు ఆరోపించాయి.