
న్యూఢిల్లీ: శ్రీలంక ఆర్థిక సంక్షోభం మూలంగా రాజకీయ సంక్షోభం ఏర్పడిన సంగతి తెలిసిందే. ప్రజలు రోడ్డెక్కి తీవ్ర ఆందోళనలు చేశారు. శ్రీలంక అధ్యక్ష, ప్రధాన మంత్రుల భవనాలను ముట్టడించారు. అధ్యక్షుడిగా గొటబాయ రాజపక్స గద్దె దిగాల్సిందేనని డిమాండ్ చేశారు. దీంతో ఆయన పారిపోయి అధ్యక్షుడిగా రాజీనామా చేశారు. తాజాగా, శ్రీలంక రాజ్యాంగం ప్రకారం పార్లమెంటు సభ్యుల రహస్య ఓటింగ్తో విక్రమసింఘే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రేపు ఆయన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన అన్ని పార్టీలను ఆహ్వానించి పార్లమెంటులో తొలి ప్రసంగం చేశారు. ఆరు సార్లు దేశ ప్రధానిగా చేసిన ఆయన.. దేశ ఆర్థిక సంక్షోభం గురించి, రాజకీయ సంక్షోభం గురించి మాట్లాడారు. అదే విధంగా ఆందోళనకారులకు స్పష్టమైన వార్నింగ్ ఇచ్చారు.
మీరు ప్రభుత్వాన్ని కూల్చాలని ఉద్దేశంతో అధ్యక్షుడు, ప్రధానమంత్రి కార్యాలయాలను ముట్టడిస్తే.. అది చట్ట విరుద్ధం, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం అని అన్నారు. చట్టంతో చలగాటం ఆడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాను హింసకు తలవంచబోనని పేర్కొన్నారు. కొందరు చేస్తున్న ఆందోళనలకు మౌనంగా ఉన్న మెజార్టీ ప్రజలను ఎందుకు బలి కావాలి? మౌనంగా ఉన్న మెజార్టీ ప్రజలు రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలని భావిస్తున్నారని చెప్పారు.
శ్రీలంకలో రాజపక్స కుటుంబానికి తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తింది. వారి చర్యల కారణంగా నేడు దేశం ఈ దుర్భర పరిస్థితికి చేరుకుందని, వారు సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే ఆర్థిక సంక్షోభం తలెత్తిందని పౌరులు భావిస్తున్నారు. అయితే, ఆ రాజపక్స కుటుంబానికి రానిల్ విక్రమసింఘే సానుకూలమైన మనిషి అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై విక్రమసింఘే తన ప్రసంగంలో ప్రస్తావించారు.
తాను రాజపక్స కుటుంబానికి ఫ్రెండ్ కాదని అన్నారు. కానీ, శ్రీలంక ప్రజలకు మిత్రుడిని అంటూ వివరించారు.
అధ్యక్షుడి ఎన్నికలో విజయం సాధించిన తర్వాత రానిల్ విక్రమసింఘే ఈ ప్రసంగం చేశారు. అలాగే, పోలీసులు, ఆర్మీని ఆయన కలుసుకుని వారిని అభినందించారు. ఈ ఆందోళనల కాలంలో దేశ పార్లమెంటు వంటి కీలకమైన జాతి చిహ్నాలను రక్షించారని కొనియాడారు.