
కొలంబో:srilanka లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎంపీలు, మాజీ మంత్రుల ఇళ్లకు ఆందోళనకారులు సాయంత్రం నిప్పు పెట్టారు. సోమవారం నాడు మధ్యాహ్నం ప్రధాని రాజపక్సే తన పదవికి రాజీనామా చేశారు. రాజపక్సే రాజీనామా చేసిన తర్వాత కూడా ఆందోళనలు సద్దుమణగలేదు. కొలంబోలో శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న వారిపై ప్రభుత్వ మద్దతుదారులు దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. శ్రీలంక మొత్తం ఘర్షణలు చోటు చేసుకొన్నాయి.
ఈ ఘర్షణల్లో అధికార పార్టీకి చెందిన ఎంపీ అమరకీర్తి అతుకొరాల చనిపోయాడు. Mahinda Rajapaksaకు చెందిన ఏడుగురు ఎంపీల ఇళ్లను ఆందోళనకారులు నిప్పు పెట్టారు.హింస చెలరేగిన ప్రాంతాల్లో టియర్ గ్యాస్ ప్రయోగించి ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. మరికొన్ని చోట్ల పోలీసులు ఏం చేయలేక చేతులెత్తేశారు. శ్రీలంక అధ్యక్షుడి భవనం సైన్యం ఆధీనంలలో ఉంది. అధ్యక్షుడు గొటబయ రాజపక్సే, మాజీ ప్రధాని మహేంద్ర రాజపక్సే కటుంబాలను కూడా ఇతర దేశాలకు ఇవాళ రాత్రికి తరలించే అవకాశం ఉందని చెబుతున్నారు.
ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణల్లో ఒక్క ఎంపీతో పాటు ఐదుగురు మరణించారు.189 మందికి పైగా గాయపడ్డారు.శ్రీలంకలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలు కార్యాలయాలపై ఆందోళనకాలరు, విధ్వంసానికి దిగారు. మాజీ మంత్రి జాన్స్టన్ ఫెర్నాండో కు చెందిన కార్యాలయాన్ని దగ్ధం చేశారు. ఆయనకు చెందిన రెండు హోటళ్లకు నిప్పు పెట్టారు.మాజీ మంత్రి నిమల్ లాస్ జా ఇంటిపై దాడి చేశారు. కొలంబోలో అధికార పార్టీకి చెందిన కార్మిక నేత కహండగామగె ఇంటిపై దాడి చేశారు.
శ్రీలంక ఆర్థిక సంక్షోభ పరిస్థితులు రోజురోజుకు మరింత దారుణంగా మారుతున్నాయి. ప్రజల నుంచి వ్యతిరేకత క్రమంగా పెరుగుతోంది. ఆర్థిక సంక్షోభంపై శ్రీలంకలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా నిరసనలు మరింతగా ఉధృతం అవుతున్నాయి. ఈ క్రమంలోనే శ్రీలంక పార్లమెంటును ముట్టడించేందుకు ప్రయత్నించిన విద్యార్థులు, ప్రజలపై పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్, జల ఫిరంగులను ప్రయోగించారు. ఇంటర్ యూనివర్శిటీ స్టూడెంట్స్ ఫెడరేషన్ నేతృత్వంలోని నిరసనకారులు శాసనసభకు దారితీసే ప్రధాన డ్రైవ్లో.. ఇనుప బారికేడ్లను తొలగిస్తున్న క్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన పోలీసులు చర్యలు తీసుకున్నారు.
దేశ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో విఫలమైన అధ్యక్షుడు గోటబయ రాజపక్స, ఆయన ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ట్రేడ్ యూనియన్ దేశవ్యాప్త సమ్మెకు దిగింది. అంతకు ముందు శ్రీలంక ప్రధాన ప్రతిపక్షం అధ్యక్షుడు గోటబయ రాజపక్సను తొలగించేందుకు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అలాగే, ఆయన సోదరుడు ప్రధాని మహింద రాజపక్స నేతృత్వంలోని ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస, యునైటెడ్ పీపుల్స్ ఫోర్స్ నాయకుడు స్పీకర్ మహింద యాపా అబేవర్ధనకు రెండు ప్రతిపాదనలు చేశారు. ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో ప్రధాని, మంత్రులు ఆర్థిక పరిస్థితికి సమిష్టి బాధ్యత వహించడంలో విఫలమయ్యారని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
1948లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత శ్రీలంక ఎదుర్కొంటున్న అత్యంత దారుణ పరస్థితులు ఇవే. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడంలో విఫలమైన ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది. ప్రభుత్వం రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే మరోసారి శ్రీలంక ఎమర్జెన్సీలోకి వెళ్లింది. భారీ ఆర్థిక సంక్షోభంపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న పరిస్థితుల మధ్య శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే శుక్రవారం అర్ధరాత్రి నుండి దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. భద్రతా బలగాలకు పూర్తి అధికారాలు అప్పగించారు.
ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు రోజురోజుకు వెల్లువెత్తడంతో ఐదు వారాల్లో దేశంలో గోటబయా ఎమర్జెన్సీ విధించడం రెండోసారి. దేశ భద్రతా పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అంతకుముందు రాజపక్సే తన వ్యక్తిగత నివాసం వెలుపల భారీ నిరసనల తర్వాత ఏప్రిల్ 1న కూడా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఆ తర్వాత ఎమర్జెన్సీని ఏప్రిల్ 5న ఉపసంహరించుకున్నారు.