పాకిస్తాన్ నూతన ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ .. రెండోసారి వరించిన అత్యున్నత పదవి

By Siva KodatiFirst Published Mar 3, 2024, 3:00 PM IST
Highlights

పాకిస్తాన్ నూతన ప్రధానిగా పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్)కు చెందిన షెహబాజ్ షరీఫ్ ఎంపికయ్యారు. ఆయన పాక్ ప్రధాని కావడం ఇది రెండోసారి. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడే షెహబాజ్ షరీఫ్. నవాజ్ అసెంబ్లీలో సీటు గెలిచి.. ప్రధాని పదవిని ఆశించారు. అయితే ఆయన పార్టీ , మిత్రపక్ష పార్టీలు మాత్రం షెహబాజ్ పేరును ప్రతిపాదించారు. 

పాకిస్తాన్ నూతన ప్రధానిగా పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్)కు చెందిన షెహబాజ్ షరీఫ్ ఎంపికయ్యారు. ఆయన పాక్ ప్రధాని కావడం ఇది రెండోసారి. ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతైన తర్వాత 16 నెలల పాటు సంకీర్ణ ప్రభుత్వాన్ని షరీఫ్ నడిపించారు. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడే షెహబాజ్ షరీఫ్. నవాజ్ అసెంబ్లీలో సీటు గెలిచి.. ప్రధాని పదవిని ఆశించారు. అయితే ఆయన పార్టీ , మిత్రపక్ష పార్టీలు మాత్రం షెహబాజ్ పేరును ప్రతిపాదించారు. 

నవాజ్ షరీఫ్ మైనారిటీ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపాలని కోరుకోవడం లేదని, గతంలో మూడుసార్లు ప్రధానిగా వున్న సమయంలో స్పష్టమైన మెజారిటీని కలిగి వున్నారని, ఆయన కుమార్తె మరియం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కుప్పకూలిన సమయంలో నవాజ్ షరీఫ్ లండన్‌లో ప్రవాస జీవితం గడుపుతున్నారు. దీంతో ప్రధాని పదవికి ఆయన అనర్హుడయ్యాడు. అయితే ఆర్మీ పావులు కదపడంతో గతేడాది అక్టోబర్‌లో పాకిస్తాన్‌లో షరీఫ్ తిరిగి అడుగుపెట్టాడు. 

పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ (పీఎంఎల్ ఎన్) తాజా ఎన్నికల్లో 264 సీట్లకు గాను 80 మాత్రమే గెలుచుకుంది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చిన్నా చితకా పార్టీలు .. నవాజ్‌కు పార్టీకి మద్ధతు పలికాయి. 2022లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత సంకీర్ణాన్ని ఏర్పాటు చేయడంలోనూ, ఐఎంఎఫ్ నుంచి పాకిస్తాన్ బెయిలౌట్‌ను పొందడంలోనూ షెహబాజ్ కీలకపాత్ర పోషించారు. మిలటరీ జనరల్స్‌తో విభేదాలున్న ఇమ్రాన్‌ఖాన్‌ను ఎదుర్కోవడంతో పాటు ఆర్మీతో సన్నిహితంగా వుండటంతో షెహబాజ్ ప్రధాని పదవిని దక్కించుకున్నారని విశ్లేషకులు అంటున్నారు.

ప్రధానిగా పనిచేయడానికి ముందు.. షెహబాజ్ షరీఫ్ దేశంలోని అతిపెద్ద ప్రావిన్స్ అయిన పంజాబ్‌కు మూడుసార్లు సీఎంగా పనిచేశారు . పీకల్లోతు ఆర్ధిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న దేశాన్ని గట్టెక్కించేందుకు షరీఫ్ తీవ్రంగా శ్రమించారు. గతేడాది జూన్‌లో ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టాలినా జార్జివాతో షరీఫ్ వ్యక్తిగతంగా మాట్లాడి పాకిస్తాన్‌కు బెయిలౌట్‌ను సాధించారు.

అయినప్పటికీ .. ఆయన ప్రభుత్వ హయాంలో పాక్ రూపాయి రికార్డు స్థాయిలో క్షీణించడంతో ద్రవ్యోల్బణం గరిష్టంగా 38 శాతానికి చేరుకుంది. ఇమ్రాన్ ఖాన్ సర్కార్ చేతగానితనం వల్లే పాకిస్తాన్ ఆర్ధిక మాంద్యంలో చిక్కుకుపోయిందని షెహబాజ్ షరీఫ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ద్రవ్యోల్బణాన్ని గాడిలో పెట్టడానికి తమ ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు, సబ్సిడీలను రద్దు చేయాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. 
 

click me!