బైశాఖి పర్వదినాన్ని పురస్కరించుకుని పాకిస్థాన్ వెళ్ళిన సిక్కు భక్తులు క్షేమంగా ఉన్నారని శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్జీపీసీ) తెలిపింది. తెహరీక్-ఈ-లబాయక్ పాకిస్థాన్ (టీఎల్పీ) చీఫ్ సాద్ హుస్సేన్ రిజ్వీని అరెస్టు చేసిన తర్వాత పాకిస్థాన్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి
బైశాఖి పర్వదినాన్ని పురస్కరించుకుని పాకిస్థాన్ వెళ్ళిన సిక్కు భక్తులు క్షేమంగా ఉన్నారని శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్జీపీసీ) తెలిపింది. తెహరీక్-ఈ-లబాయక్ పాకిస్థాన్ (టీఎల్పీ) చీఫ్ సాద్ హుస్సేన్ రిజ్వీని అరెస్టు చేసిన తర్వాత పాకిస్థాన్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ సిక్కు భక్తుల యోగ, క్షేమాలపై వారి కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
టీఎల్పీ నేత రిజ్వీని అరెస్టు చేసిన తర్వాత పాకిస్థాన్లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోందని, హింసాకాండ చెలరేగిందని ఎస్జీపీసీ కార్యదర్శి చెప్పారు. దీంతో పాక్లోని పంజా సాహిబ్ గురుద్వారాకు వెళ్తున్న భారతీయ సిక్కు భక్తులు మార్గమధ్యంలో చిక్కుకుపోయినట్లు వెల్లడించారు.
అనేక ఇబ్బందులు ఎదుర్కొని, ఎట్టకేలకు లాహోర్లోని శ్రీ డేరా సాహిబ్కు చేరుకున్నట్లు ఆయన వెల్లడించారు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో వీరు పంజా సాహిబ్కు బయల్దేరి వెళ్ళారని, అనంతరం పంజా సాహిబ్ ఆసుపత్రికి చేరుకున్నారని ఎస్జీపీసీ పేర్కొంది. భారతీయ సిక్కు భక్తులకు పాకిస్థాన్ ప్రభుత్వం, పాకిస్థాన్ గురుద్వారా ప్రధాన్ సత్వంత్ సింగ్ మద్దతుగా నిలిచారని వివరించింది.
కాగా, ఫ్రెంచ్ అంబాసిడర్ను పాకిస్థాన్ నుంచి బహిష్కరించాలని, ఫ్రాన్స్ నుంచి దిగుమతులను నిషేధించాలని టీఎల్పీ చీఫ్ రిజ్వీ డిమాండ్ చేస్తున్నారు. దైవ దూషణగా పరిగణించదగిన కేరికేచర్లను పారిస్లో ప్రచురిండాన్ని రిజ్వీ తీవ్రంగా ఖండించారు. ఆయనను అరెస్టు చేయడంతో పాకిస్థాన్లో నిరసనలు పెల్లుబికుతున్నాయి.