
న్యూఢిల్లీ : ఉక్రెయిన్ (Ukraine) లో గురువారం ఉదయం మొదలైన హింసాత్మక ఘటనలను తక్షణమే ఆపాలని ప్రధాని నరేంద్ర మోదీ (pm modi) రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (vladimir putin)ను కోరారు. ఈ మేరకు ప్రధాని మోడీ పుతిన్ కు గురువారం రాత్రి సమయంలో ఫోన్ కాల్ చేశారు. ఉక్రెయిన్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ సాయం చేయాలని ఆ దేశం విజ్ఞప్తి చేసిన కొన్ని గంటల తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది.
ఉక్రెయిన్, రష్యా మధ్య దౌత్యపరమైన చర్చలు, సంభాషణల కోసం అన్ని వైపుల నుంచి సమిష్టి కృషి అసవరం అని మోడీ పిలుపునిచ్చారని ప్రధాన మంత్రి కార్యాలయం (pmo) ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘రష్యా, NATO సమూహం మధ్య నెలకొన్న విభేదాలు నిజాయితీతో కూడిన సంభాషణ ద్వారా మాత్రమే పరిష్కారం అవుతాయని ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు. ఉక్రెయిన్, రష్యా మధ్య ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలను రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రధాని మోదీకి వివరించారు.
ఉక్రెయిన్లోని భారతీయ పౌరులు, ముఖ్యంగా విద్యార్థుల భద్రతకు సంబంధించి భారతదేశ ఆందోళనలపై కూడా ప్రధాని మోడీ పుతిన్ తో చర్చించారు. అక్కడి స్టూడెంట్లు తిరిగి ఇండియాకు రావడనికి తమ దేశం అత్యంత ప్రధాన్యత ఇస్తోందని తెలిపారు. సమయోచిత ఆసక్తి ఉన్న అంశాలపై తమ అధికారులు, దౌత్య బృందాలు క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతూనే ఉంటాయని ఇరువురు నేతలు అంగీకరించారని PMO ఒక ప్రకటనలో తెలిపింది.
నాటోలో ఉక్రెయిన్ చేరడం పల్ల కొన్ని నెలలుగా ఉక్రెయిన్, రష్యా మధ్య ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. గత కొంత కాలంగా రెండు దేశాల మధ్య యుద్దం జరుగుతాయనే ఉద్రిక్తత నెలకొంది. అయితే నేటి ఉదయం ఉన్నట్టుండి ఒక్కసారిగా రష్యా ఉక్రెయిన్ పై యుద్దం చేయడం ప్రారంభించింది. ఉక్రెయిన్ పాశ్చాత్య దేశాల కీలుబొమ్మ అని, అది సరైన దేశం కాదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గతంలోనే పేర్కొన్నారు.
ఇటీవల కాలం నుంచి రష్యాకు చెందిన యుద్ద ట్యాంకులు, ఇతర భారీ పరికరాలు ఉక్రెయిన్లోని అనేక ఉత్తర ప్రాంతాలలోకి ప్రవేశిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం, రష్యా ఈ రెండు ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా గుర్తించింది, ఇవి ప్రధానంగా తూర్పు ఉక్రెయిన్లో ఉన్నాయి. ఈ ప్రాంతాలు 2014 నుండి రష్యన్ మాట్లాడే ప్రజల నుండి తిరుగుబాటును ఎదుర్కొంటున్నాయి.
పుతిన్ రెండు ప్రాంతాలను గుర్తిస్తున్నానని ప్రకటించిన వెంటనే ఈ రెండు ప్రాంతాలకు చెందిన తిరుగుబాటుదారులు ఉక్రేనియన్ సాయుధ దళాలతో వ్యవహరించడానికి సైనిక సహాయం అందించాలని రష్యా ప్రభుత్వాన్ని కోరారు. క్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఉక్రెయిన్లో ప్రస్తుత పరిస్థితిపై చర్చ జరుగుతుండగా, గురువారం ఒకే సమయంలో ఈ రెండు ప్రాంతాలలో సైనిక కార్యకలాపాలను నిర్వహిస్తామని పుతిన్ ప్రకటించారు. అందులో భాగంగానే నేటి ఉదయం నుంచి రష్యన్ క్షిపణులు ఉక్రెయిన్ లోని పలు నగరాలపై బాంబుల వర్షం కురిపించాయి. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఉక్రెయిన్లో 11 ఏరోడ్రోమ్లతో సహా 74 భూమిపైన ఉన్న సైనిక మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసింది. ఉదయం నుంచి రాత్రి వరకు దాదాపు రష్యా 203 సార్లు దాడులు చేసిందని ఉక్రెయిన్ తెలిపింది. రష్యా దాడుల వల్ల 68 మంది సైనికులు, పౌరులు మరణించారు.