
న్యూఢిల్లీ: రష్యాలో జరగనున్న అంతర్జాతీయ సమావేశానికి ఆ దేశ ప్రతినిధులు తాలిబాన్లను ఆహ్వానించనున్నారు. అక్టోబర్ 20న ఆఫ్ఘనిస్తాన్పై రష్యా ఓ అంతర్జాతీయ సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ విషయాన్ని రష్యా ప్రతినిధి జామిర్ కబులోవ్ ధ్రువీకరించారు. ఈ ఏడాది మార్చిలో మాస్కో ఓ సమావేశాన్ని నిర్వహించింది. ఇందులో రష్యా, అమెరికా, చైనాలు పాల్గొన్నాయి. అనంతరం, అక్టోబర్ 20న నిర్వహించే సమావేశంలో తాలిబాన్లను ఆహ్వానించాలని రష్యా, పాకిస్తాన్ ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
నిజానికి ఆ సమావేశం నిర్వహించినప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో పౌరులు ఎన్నుకున్న అష్రప్ ఘనీ ప్రభుత్వానికి తాలిబాన్లకు మధ్య భీకర యుద్ధం జరుగుతున్నది. అప్పుడే హింసాత్మక దారిని వదిలిపెట్టాలని, శాంతి నెలకొనడానికి దోహదపడాలనే ఉద్దేశ్యంతో తాలిబాన్లను ఈ భేటీకి ఆహ్వానించారు. కానీ, ఆగస్టులోనే పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి. అమెరికా సేనలు వెనక్కి మళ్లడం తాలిబాన్లు అధికారాన్ని స్వాధీనం చేసుకోవడం చకచకా జరిగిపోయాయి.
మాజీ సోవియెట్ దేశాల్లోకి ఉగ్రవాదుల చొరబాట్లు, ఇతర హింసాత్మక దాడులు జరిగే ముప్పు ఉన్నదని రష్యా ప్రభుత్వం ఆందోళనలో ఉన్నది. అది దాని భద్రతకు ముప్పుగా మారే అవకాశముందని అభిప్రాయపడింది. అందుకే ఈ భేటీ నిర్వహించాలని అప్పుడు భావించింది. కాగా, తాలిబాన్లు అధికారాన్ని చేజక్కించుకున్న తర్వాత పొరుగునే ఉన్న తజకిస్తాన్లో రష్యా ప్రభుత్వం మిలిటరీ ఎక్సర్సైజులూ చేపట్టింది. తజకిస్తాన్లోనూ మిలిటరీ పటిష్టానికి చర్యలు తీసుకుంది.