
న్యూఢిల్లీ: ప్రతి నిర్ణయం వెనుక ఆర్థిక కారణాలు ఉంటాయని విశ్లేషించడం పెద్ద కష్టమేమీ కాదు. గతంలోనూ వ్యాణిజ్యపరంగా వ్యూహాత్మకంగా ఉన్న దేశాల కోసం పెద్ద దేశాల మధ్య యుద్ధాలు జరిగిన దాఖలాలు కోకొల్లలు. ఇప్పుడు మరోసారి ఓ పెద్ద దేశం పొరుగునే ఉన్న చిన్న దేశంపై దాడికి దిగింది. బయటికి ఇలా కనిపిస్తున్నా.. చిన్న దేశం పక్కన మరెన్నో పెద్ద దేశాలు నిలబడి ఉన్నాయి. నేడు ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి కారణాలు అనేకం ఉన్నా.. అది భౌగోళికంగా వ్యూహాత్మక దేశం కూడా కావడం గమనార్హం. యూరప్ దేశాలకు పెద్ద చమురు ఎగుమతిదారుగా ఉన్న రష్యా ఆ ఆయిల్ను సరఫరా చేయడానికి ఉక్రెయిన్ కీలక ప్రాంతంలో ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఒక వైపు ఉక్రెయిన్పై రష్యా దాడి చేస్తూనే మరో వైపు ఆ దేశానికి చమురు రవాణా కోసం డబ్బులు చెల్లిస్తుండటం గమనార్హం.
ఉక్రెయిన్పై యుద్ధం ప్రారంభించే సమయంలో అంటే జనవరిలో రోజువారీ రష్యా చమురు ఎగుమతులు క్షీణిస్తూ వచ్చాయి. జనవరిలోనే చాలా కనిష్టానికి పడిపోయాయి. ఆ తర్వాత అందరి భయాలను నిజం చేస్తూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఉక్రెయిన్పై యుద్ధాన్ని ప్రకటించాడు. దాడులు ప్రారంభించగానే అమెరికా, పశ్చిమ దేశాలు రష్యాకు వార్నింగ్ ఇచ్చాయి. వెంటనే యుద్ధాన్ని నిలిపేయాలని, లేదంటే కఠిన ఆర్థిక ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించాయి. కానీ, వ్లాదిమిర్ పుతిన్ వెనకడుగు వేయలేదు. దాడిని ముమ్మరం చేశారు. దీంతో పుతిన్ యుద్ధం నుంచి వెనక్కి వెళ్లడానికి ఆర్థికంగా బంధించాలని పశ్చిమ దేశాలు భావించాయి. ఆర్థిక ఆంక్షలు విధించాయి.
కానీ, వ్లాదిమిర్ పుతిన్ ఈ ఆర్థిక ఆంక్షలకూ వెనుకంజ వేయలేదు. దానికి బదులుగా తాము ఎగుమతి చేసే చమురును మరింత చౌకగా సరఫరా చేయడానికి ప్రపంచ దేశాలను ప్రలోభ పెట్టారు. అదీగాక, యూరప్ దేశాలు సైతం సుదూర ప్రాంతాల నుంచి తమకు అవసరం ఉన్న మేర చమురును దిగుమతి చేసుకోవడం దుస్సహంగా మారింది. కొంత కాలం ఆంక్షలను తట్టుకోగలవని, దీర్ఘకాలం తాము విధించిన ఆంక్షలు తమకే తిప్పలు తెచ్చినట్టుగా భావించాయి. అందుకే కొన్ని యూరప్ దేశాలు మళ్లీ రష్యా నుంచి చమురు ఎగుమతులను పున:ప్రారంభించాయి.
అయితే, ఈ ఎగుమతులు ప్రధానంగా రెండు మార్గాల్లో సాగుతున్నాయి. ఒకటి రష్యా నుంచి ఉక్రెయిన్ మీదుగా ఉన్న గ్యాస్ పైప్లైన్ల ద్వారా యూరప్ కస్టమర్లకు చేరుతున్నది, మరొక దారి బెలారస్, పొలాండ్, జర్మనీ వరకు ఉన్న పైప్లైన్ ద్వారా సరఫరా అవుతున్నది. అయితే, ఒక వైపు ఉక్రెయిన్పై యుద్ధం చేస్తూనే అదే దేశం గుండా చమురును సరఫరా చేస్తున్నది. దీనికోసం ఉక్రెయిన్ దేశానికి నగదును పూర్తిస్థాయిలో అందిస్తున్నది. ఒక వైపు యుద్ధం చేస్తూనే మరో వైపు చమురు రవాణా కోసం ఆ దేశ పైప్లైన్ వినియోగిస్తున్న ఉక్రెయిన్కు నగదు చెల్లిస్తూ వాణిజ్యాన్ని మెయింటెయిన్ చేస్తుండటం గమనార్హం. రష్యా ప్రభుత్వ నియంత్రణలోని ఎన్జేఎస్సీ నాఫ్తోగ్యాజ్ సంస్థ సీఈవో యురియ్ విట్రెంకో ఈ మేరకు వివరించారు. రష్యా చమురును సరఫరా చేస్తున్నందుకు ఉక్రెయిన్కు డబ్బు చెల్లిస్తున్నామని తెలిపారు.
మరోవైపు యూరప్ దేశాలకు చమురు ఎగుమతి చేస్తూ ఆ దేశాల డబ్బును థర్డ్ పార్టీ అకౌంట్లో జమ చేసే ఒప్పందానికి వచ్చారు. యుద్ధం ముగిసిన తర్వాత వ్లాదిమిర్ పుతిన్ ఆ డబ్బును ఉపసంహరించుకుంటారు. ఈ ఒప్పందం ద్వారా యూరప్ దేశాలు చమురును దిగుమతి చేసుకుంటూ కూడా నేరుగా డబ్బును రష్యాకు అందించడం లేదు. తద్వారా చమురును కొనుగోలు చేసి డబ్బును అందించకుండా మరింత ఒత్తిడిని రష్యాపై మోపుతున్నట్టూ ఆ దేశాలు పేర్కొన్నాయి.