కాబుల్ ఎయిర్ పోర్ట్ వద్ద మళ్లీ రాకెట్ల వర్షం... క్షిపణి రక్షణ వ్యవస్థ ద్వారా కూల్చివేత..

By AN TeluguFirst Published Aug 30, 2021, 11:29 AM IST
Highlights

లాబ్ జార్ ఖైర్ఖానాలోని  ఖోర్ షిద్ ప్రైవేటు యూనివర్సిటీ సమీపంలో ఉంచిన ఓ వాహనం నుంచి ఈ రాకెట్లను ప్రయోగించినట్లు తెలిసింది. ఎయిర్ పోర్ట్ లో ఉన్న క్షిపణి రక్షణ వ్యవస్థ వీటిని గుర్తించి ప్రతి దాడి చేయడంతో విమానాశ్రయం సమీపంలో సలీం కార్వాన్ ప్రాంతంలో కూలిపోయాయి.

కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో యుద్ధవాతావరణం నెలకొంది.  కాబూల్ ఎయిర్ పోర్టును లక్ష్యంగా చేసుకుని మళ్లీ రాకెట్ దాడులు జరిగాయి.  అయితే వీటిని క్షిపణి రక్షణ వ్యవస్థ ద్వారా  కూల్చి వేసినట్టు తెలుస్తోంది.  సోమవారం ఉదయం పలు రాకెట్లు ఎయిర్పోర్టు వైపు దూసుకు వచ్చినట్లు ప్రత్యక్షసాక్షులు కొందరు తెలిపారు. కాసేపటి తర్వాత వాటిని కూల్చివేసిన శబ్దాలు వినిపించినట్లు చెప్పారు.

లాబ్ జార్ ఖైర్ఖానాలోని  ఖోర్ షిద్ ప్రైవేటు యూనివర్సిటీ సమీపంలో ఉంచిన ఓ వాహనం నుంచి ఈ రాకెట్లను ప్రయోగించినట్లు తెలిసింది. ఎయిర్ పోర్ట్ లో ఉన్న క్షిపణి రక్షణ వ్యవస్థ వీటిని గుర్తించి ప్రతి దాడి చేయడంతో విమానాశ్రయం సమీపంలో సలీం కార్వాన్ ప్రాంతంలో కూలిపోయాయి.

 అయితే రాకెట్ల దాడికి పాల్పడింది ఎవరనేది ఇంకా తెలియరాలేదు.  పేలుడు శబ్దాలతో ఎయిర్పోర్ట్ వద్ద ఉన్న ఆఫ్ఘన్ పౌరులు భయాందోళనలతో అక్కడి నుంచి పరుగులు పెట్టారు.  మొత్తం ఐదు రాకెట్లు ప్రయోగించినట్లు స్థానిక మీడియా కథనాల సమాచారం.

కాబూల్ ఎయిర్ పోర్ట్ వద్ద ఆదివారం కూడా ఇలాంటి దాడి చోటు చేసుకున్న విషయం తెలిసిందే విమానాశ్రయానికి వాయువ్య దిశలో కేవలం ఒక కిలోమీటర్ దూరం లోని ఖువ్జా బుఘ్రా  ప్రాంతంలో జరిగింది.  ఈ ఘటనలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు.  మరోవైపు నిన్న కాబూల్లో  భారీ ఉగ్ర కుట్ర ను అమెరికా భగ్నం చేసింది. 

నిన్న ఎయిర్ పోర్ట్ వద్ద ఆత్మాహుతి పేలుళ్లకు పాల్పడేందుకు ఓ వాహనంలో ముష్కరులు దూసుకు రావడాన్ని గమనించిన అమెరికా భద్రతా బలగాలు డ్రోన్ దాడి ద్వారా వారిని మట్టుబెట్టారు.  ఇదిలా ఉండగా.. ఆఫ్టర్ నుంచి అమెరికా దళాల ఉపసంహరణ రేపటితో ముగియనుండడం గమనార్హం.

click me!