
కాబూల్: ఆప్ఘనిస్తాన్ లోని టోలో న్యూస్ ఛానెల్ రిపోర్టర్ ను తాలిబన్లు కాల్చి చంపారనే ప్రచారంలో వాస్తవం లేదని తేలింది. తాను బతికే ఉన్నానని చనిపోయినట్టుగా ప్రచారం సాగుతున్న రిపోర్టర్ ట్వీట్ చేశాడు.ఆఫ్ఘనిస్తాన్ లో తొలి స్వతంత్ర న్యూస్ ఛానెల్ లో రిపోర్టర్ గా జియార్ యాద్ ఖాన్ పనిచేస్తున్నాడు. కాబూల్ కేంద్రంగా ఆయన పనిచేస్తున్నాడు. జియార్ యాద్ ఖాన్ ను చంపిపనట్టుగా ప్రచారం సాగింది. అయితే తాను బతికే ఉన్నానని ఆయన ప్రకటించారు.
తాలిబన్లు తనను కొట్టారని ఆయన ఆ ట్వీట్లో పేర్కొన్నారు. కాబూల్ న్యూ సిటీలో తాను రిపోర్టింగ్ చేసే సమయంలో తనపై తాలిబన్లు దాడి చేశారని ఆయన చెప్పారు. కెమెరాతో పాటు టెక్నికల్ సామాగ్రితో పాటు తన స్వంత మొబైల్ ను కూడ తాలిబన్లు తీసుకెళ్లారని ఆయన ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.
తాలిబన్లు తనను తుపాకీతో కొట్టారని ఆయన చెప్పారు. తాను చనిపోయినట్టుగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన తేల్చి చెప్పారు.రిపోర్టర్ పేరుతో వచ్చిన ట్వీట్ నిజమైందా, నకిలీదా అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఇంతకుముందు జూలై మాసంలో అంతర్జాతీయ వార్తా సంస్థలో పనిచేస్తున్న భారతీయ ఫోటో జర్నలిస్టు డానిష్ సిద్దిఖీ కందహార్ లో హత్యకు గురయ్యాడు. కాందహార్ లో పరిస్థితులను కవర్ చేస్తున్న సమయంలో తాలిబన్ల చేతిలో సిద్దిఖీ హత్యకు గురయ్యారు.