
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి అన్ని దేశాలకు చెందిన వేలాది మంది ప్రజలు, ప్రముఖులు ఆసనాలు వేశారు. వారిని ఉత్సాహపరుస్తూ ప్రధాని మోడీ కూడా ఆసనాలు వేశారు.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. యోగాకు ఎలాంటి పేటెంట్, రాయల్టీ లేవన్నారు. యోగా డే జరపాలనే భారత్ ప్రతిపాదనకు అన్ని దేశాలు అండగా నిలిచాయని మోడీ గుర్తుచేశారు. భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి యోగా ప్రాచుర్యంలో వుందని.. యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం సమకూరుతుందన్నారు. యోగా అంటే అందరినీ కలిపేదని నరేంద్ర మోడీ అన్నారు. ఈ ఏడాదిని మిల్లెట్ ఇయర్గా భారతదేశం ప్రతిపాదించిందని.. దీనిని ప్రపంచం ఆమోదించిందని చెప్పారు.